పంజాబ్ రైలు ప్రమాద ఘటన: కార్యక్రమం నిర్వహణకు పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారు..?
Recommended Video
అమృత్సర్: పంజాబ్లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 61కి చేరుకుంది. రావణదహన కార్యక్రమం వీక్షిస్తుండగా పట్టాలపై నిల్చున్న వారిపైకి రైలు మృత్యుశకటంలా దూసుకొచ్చింది. అయితే ఇది పూర్తిగా అధికారుల వైఫల్యంగా తెలుస్తోంది. రావణాసురిడి దహనం కార్యక్రమం నిర్వహించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ పోలీసుల అనుమతి కోరింది. అది కూడా జోదా పాటక్ దగ్గరలోని దోభీఘాట్లో ఎకరా స్థలం ఉందని అక్కడ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరింది కమిటీ. అంత పెద్ద సంఖ్యలో వచ్చిన జనానికి ఆ స్థలం వాస్తవానికి సరిపోదు. దీంతో ప్రజలు పట్టాలపైకి వెళ్లి నిల్చున్నారు.
ట్రాక్పై రావణ దహనం, పైనుంచి దూసుకెళ్లిన రైలు, 61మంది మృతి
మున్సిపల్ కార్పోరేషన్ దోభీ ఘాట్ స్థలం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ స్థలం ట్రాక్కు సమీపంలోనే ఉంది. గతేడాది కూడా ఆర్గనైజింగ్ కమిటీ ఇక్కడే చోటు కేటాయించాల్సిందిగా అధికారులను అడగటంతో వారు ఒప్పుకోలేదు. కానీ ఈ సారి ఎలా ఒప్పుకున్నారో తమకు అర్థం కావడం లేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే స్టేషన్ హౌజ్ ఆఫీసర్ క్లియరెన్స్ ఇచ్చాకే దోబీఘాట్లో రావణ దహన కార్యక్రమం జరిపేందుకు అనుమతి ఇచ్చినట్లు డీసీపీ అమ్రిక్ సింగ్ పవార్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్లుగా సౌరభ్ మిథు మదన్ వ్యవహరించాడు. ఈయన 29వ వార్డు కౌన్సిలర్ విజయ్ మదన్ కుమారుడు. వీరి కుటుంబం పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కుటుంబానికి చాలా సన్నిహితమని సమాచారం. ఈ కార్యక్రమానికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సిద్ధూ కూడా రావొచ్చు అనే వార్త పొక్కడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలివచ్చారు. ఇక రావణాసురుడి దిష్టి బొమ్మను ట్రాక్కు కేవలం 100 అడుగుల దూరంలోనే ఉంచారు. ఆ పై దహనం చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున బాణా సంచా పేలడం, పెద్ద శబ్దం రావడంతో పట్టాలపై ఉన్నవారికి రైలు శబ్దం వినిపించలేదు. రైలు వస్తుందన్న సంగతి తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.