పంజాబ్ రైలు ప్రమాదం: వాట్సాప్ ద్వారా భర్తకు భార్య వీడ్కోలు, కన్నీరుమున్నీరు!
అమృత్సర్: పంజాబ్లో ఇటీవల ఘోర రైలు ప్రమాదం జరిగి, తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ విషాదంలో అరవై మందికి పైగా చనిపోయారు. ఈ దుర్ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపగా, అధికారుల తీరు వారిని మరింత కుంగిపోయేలా చేసింది. ఈ సంఘటన తెలిసి, అధికారులపై అందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ రైలు ప్రమాదం: ట్రెయిన్ వేగంపై సిద్ధూ ప్రశ్నల వర్షం, భార్యకు అండగా
ఏ ప్రభుత్వమూ సహకరించలేదని కన్నీటిపర్యంతం
పంజాబ్ రైలు ప్రమాదంలో బీహార్కు చెందిన రాజేష్ భగత్ కూడా చనిపోయాడు. అతనిది బీహార్లోని సలోనా గ్రామం. అతని మృతదేహాన్ని ఇచ్చేందుకు అధికారులు డబ్బులు అడుగుతున్నారట. ఈ మేరకు రాజేష్ భగత్ భార్య ఆరోపణలు చేశారు. తన భర్త మృతదేహాన్ని అటు పంజాబ్ ప్రభుత్వం పంపించవచ్చునని లేదంటే బీహార్ ప్రభుత్వం తీసుకు రావొచ్చునని చెప్పారు. తన భర్త మృతదేహం తీసుకు వచ్చేందుకు సహాయం చేయవచ్చునని, కానీ ఏ ప్రభుత్వమూ సహకరించడం లేదన్నారు.
రూ.45వేలు అవుతుందని చెప్పిన అధికారులు
తమకు ఏ ప్రభుత్వమూ సహకరించడం లేదని రాజేష్ సతీమణి ఆరోపించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలకు ఆయా కుటుంబాలు అంతిమ సంస్కారాలు నిర్వహించాయి. కానీ రాజేష్ సతీమణి మాత్రం నిర్వహించలేకపోయింది. అందుకు, తన భర్త మృతదేహం ఇంటికి రావాలంటే రూ.45వేలు అవుతుందని అధికారులు చెప్పడమే కారణమని ఆరోపిస్తున్నారు. అయితే వారిది పేద కుటుంబం.
వాట్సాప్లో భర్త డెడ్ బాడీ ఫోటో చూసి వీడ్కోలు
దీంతో రాజేష్ సతీమణి ఏం చేయలేకపోయారు. ఆమె గర్భిణీ. అంత మొత్తం తెచ్చే పరిస్థితుల్లో లేదు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు వచ్చి కట్టాలో ఆ కుటుంబానికి తోచలేదు. దీంతో రాజేష్ భార్య వాట్సాప్ ద్వారా తన భర్తకు తుది వీడ్కోలు పలికారు. వాట్సాప్ ద్వారా మాత్రమే తన భర్త ఫోటోను చూడగలిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
గ్రామస్తుల సాయం
రాజేష్కు ఇద్దరు పిల్లలు. భార్య మళ్లీ గర్భిణి. అతను చనిపోవడంతో కుటుంబ భారం ఆమె పైన పడింది. ఈ సంఘటనతో చలించిన గ్రామస్తులు రాజేష్ భార్యకు ఆర్థికంగా కొంత మొత్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తన కుటుంబ పోషణ కోసం ఏదైనా మార్గం చూపించాలని అధికారులకు రాజేష్ భార్య విజ్ఞప్తి చేశారు.