అదే జరిగితే పంజాబ్ అగ్నిగుండంలా మారుతుంది: కేంద్రానికి సీఎం అమరీందర్ హెచ్చరిక
న్యూఢిల్లీ: సట్లేజ్-యమునా లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయితే పంజాబ్ అగ్నిగుండంలా మారుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్రాన్ని హెచ్చరించారు. హర్యానాతో నీటి పంపకంపై ఒత్తిడి చేస్తే ఇదో జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని తేల్చి చెప్పారు. మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో విర్చువల్ సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
పంజాబ్ అగ్నిగుండమే.. జాతీయ సమస్యగా: అమరీందర్ సింగ్
సట్లేజ్-యమునా లింక్ కెనాల్ నిర్మిస్తే పంజాబ్ అగ్నిగుండంగా మారుతుందని, ఇదో జాతీయ భద్రతా సమస్యకు కూడా దారితీస్తుందని పంజాబ్ సీఎం అమరీందర్ హెచ్చరించారు. అయతే, ఈ సమస్యపై మరోసారి అమరీందర్ సింగ్తో చర్చలు జరుపుతామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
కెనాల్ నిర్మాణానికే కట్టుబడి ఉన్నామంటూ హర్యానా సీఎం..
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కారం లబిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. సట్లేజ్-యమునా లింక్ కెనాల్ నిర్మాణం పూర్తికావాలన్న వైఖరికే తాము కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేగాక, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పిందని గుర్తు చేశారు. కెనాల్ నిర్మాణం అంశంపై ఇరు రాష్ట్రాల సీఎంలు ఛండీగఢ్లో సమావేశమై చర్చలు జరుపుతారని, అయితే దీనికి తేదీని త్వరలోనే నిర్ణయించనున్నట్లు తెలిపారు. కాగా, 1966లో పంజాబ్, హర్యానా రాష్ట్రాటు తర్వాత నుంచే ఇరు రాష్ట్రాల మధ్య జలాల పంపకంపై వివాదం కొనసాగుతోంది.
1975 నుంచే ఈ జల వివాదం..
తమకు ఎక్కువ వాటా కావాలని హర్యానా కోరుతుండగా.. అందుకు పంజాబ్ ససేమిరా అంటోంది. తమకు మిగులు జలాలు ఏమీ లేవని, అందుకే తాము పంపకం చేయమని తెగేసి చెబుతోంది. ఇక 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి జలాలను ఇరు రాష్ట్రాల మధ్య విభజించి, పంచుకునేందుకు వీలుగా కెనాల్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది. ఆ తర్వాత 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ కెనాల్ నిర్మాణం చేపట్టగా.. దీనిపై శిరోమణి అకాళీ దళ్ పెద్దఎత్తున ఆందోళనలు చేసింది. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కొత్త ట్రిబ్యునల్ కోసం ఎస్ఏడీ చీఫ్ హర్చంద్ సింగ్ లోంగోవాల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, అదే నెలలో మిలిటెంట్ల చేతిలో లోంగోవాల్ ప్రాణాలు కోల్పోయారు.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో..
ఈ నేపథ్యంలో ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు రాష్ట్రాలకు మధ్యవర్తిత్వం వహించాలని జులై 28న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే మంగళవారం ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం జరపగా.. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కేంద్రానికి తాజా హెచ్చరికలు చేయడం గమనార్హం.