ఐపీఎస్ అందానికి ఫిదా: పంజాబ్ నుంచి ఉజ్జయిని వచ్చి యువతి హంగామా, సచిన్ ఏం చెప్పారంటే?
ఉజ్జయిని: క్రికెట్, సినిమా తారలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. అవసరమైతే సుదూర ప్రయాణం చేసి తమ అభిమాన హీరోలను కలుసుకుంటారు. అయితే, పంజాబ్లోని హోషియార్ జిల్లాకు చెందిన ఓ యువతి మధ్యప్రదేశ్లోని ఓ ఐపీఎస్ అధికారిని చూసి ముచ్చటపడి అతని కోసం ఉజ్జయినికి వచ్చింది.
ఆమె మూడు రోజుల క్రితం ఉజ్జయినికి వ్చింది. ఆమె వయస్సు 27 ఏళ్లు. తాను ఎస్పీ సచిన్ అతుల్కర్ను(34) కలవాలని పట్టుబట్టడంతో పోలీసులు తలపట్టుకున్నారు. సోషల్ మీడియాలో అతని ఫోటో చూసి ఆమె మనసు పారేసుకుంది. అతనిని కలిసి ప్రేమను వ్యక్తం చేసేందుకు ఆమె వచ్చినట్లుగా గుర్తించారు. ఆమెకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు.
ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని, కానీ ఆమె వినడం లేదని మహిళా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ రేఖా వర్మ తెలిపారు. ఎస్పీని కలవాలని ఆమె పట్టుదలతో ఉన్నారని, తల్లిదండ్రులను పిలిపించినా వెళ్లేందుకు సిద్ధంగా లేదని, ఆమె సైకాలజీలో పీజీ చేస్తోందని తెలిపారు.
ఆ యువతిని నాగ్డా రైల్వే స్టేషన్ తీసుకు వెళ్లి పంజాబ్ రైలు ఎక్కించే ప్రయత్నం చేశారు. కానీ రైలు కదలగానే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో పోలీసులు ఏం చేయలేకపోయారు. ఉజ్జయిని వచ్చిన ఆమె పిజ్జాలు సహా తనకు ఇష్టమైన ఆహారాన్ని డిమాండ్ చేస్తోంది. పోలీసులు వాటిని సమకూర్చుతున్నారు.
యువతిని కలవడంపై సచిన్ అతుల్కర్ను సంప్రదిస్తే విధినిర్వహణలో తాను ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని, వ్యక్తిగత విషయాల్లో మాత్రం తన ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోనని చెప్పారు. తాను సాగర్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఏడేళ్ల బాలుడి తల్లిదండ్రులను తనను కలిసి మీరు ఆటోగ్రాఫ్ ఇస్తేనే తన కొడుకు భోజనం చేస్తానని చెబుతున్నాడని తన దృష్టికి తీసుకురాగానే వారి విజ్ఞప్తిని మన్నించానని చెప్పారు.
సచిన్ అతుల్కర్ బ్యాచిలర్. ప్రతి రోజు 70 నిమిషాల పాటు జిమ్లో గడుపుతారు. ఇటీవల భోపాల్లో జరిగిన ఐపీఎస్ అధికారుల సమావేశాల్లో ఫిట్నెస్ కాంపిటీషన్లో అతను పలు అవార్డులు అందుకున్నాడు.