పంజాబ్లో దారుణం : తన కుటుంబానికి చెందిన ఐదుగురిని కాల్చిన వ్యక్తి , అనంతరం ఆత్మహత్య
మోగా: పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అదే కుటుంబ సభ్యుడు కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. మోగా జిల్లా నాథూవాల్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. సందీప్ సింగ్ అనే వ్యక్తి తన నాణమ్మ, తండ్రి, తల్లి, సోదరి, ఆమె మూడేళ్ల బాలికను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే సందీప్ తాతకు బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తన కుటుంబ సభ్యులను కాల్చేందుకు వాడిన తుపాకీని తాను వేరే దగ్గరనుంచి దొంగలించినట్లు పోలీసులు చెప్పారు. ఇక కుటుంబ సభ్యులను కాల్చిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఓ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సందీప్. తమ కుటుంబంకు కాదని దూరపు బంధువులకు తన తాత భూమి రాసిచ్చాడనే కోపంతో అందరినీ చంపుతున్నట్లు సూసైడ్ నోట్లో రాశాడు. కేవలం ఆవేశంలోనే అందరిని కాల్చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక తీవ్రగాయాల పాలైన సందీప్ తాత గురుచరణ్ సింగ్ ఫరీద్కోట్లోని గురుగోబింద్ సింగ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అరైన్వాలా అనే గ్రామంలో నివాసముంటున్న తన బంధువుల ఇంటినుంచి తుపాకీ దొంగతనం చేసినట్లు సందీప్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని గ్రామ సర్పంచ్ జగ్సీర్ సింగ్ చెప్పారు. ఆ గ్రామంలో సందీప్ కుటుంబం మంచి ఆస్తులున్న కుటుంబంగా గుర్తింపు పొందింది. వారికి 25 ఏకరాల భూమి, గ్రామం మధ్యలో పెద్ద భవంతి ఉంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకే కుటుంబంకు చెందిన ఐదు మందిని అందులో మూడేళ్ల చిన్నారిని కూడా అత్యంత పాశవికంగా కాల్చి చంపడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.