రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట హింస కేసు ప్రధాన నిందితుడు, పంజాబీ నటుడు దీప్ సిద్ధూ అరెస్ట్
రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ కిసాన్ పరేడ్ సందర్భంగా హింసను ప్రేరేపించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్ధును ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ మంగళవారం అరెస్టు చేసింది. జనవరి 26 న ఎర్రకోట వద్ద జరిగిన హింసలో పలువురు రైతులు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్లోని పలు బృందాలు నాడు హింసకు కారకులను కోసం కొద్దిరోజులుగా గాలిస్తున్నాయి.
ఎర్రకోట వద్ద జెండా ఎగరవేసిన దీప్ సిద్ధూ అరెస్ట్
ఎర్రకోట వద్ద జరిగిన హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడైన దీప్ సిద్ధూను ఎట్టకేలకు అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ఎర్ర కోట వద్ద జరిగినహింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు గతంలో దీప్ సిద్ధూ తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. అప్పటి నుండి దీప్ సిద్ధూ పరారీలో ఉన్నారు.ఎర్రకోట వద్ద జెండా ఎగరవేసిన దీప్ సిద్ధూ, జుగ్రాజ్ సింగ్ , గుర్జంత్ సింగ్ ఆచూకీ చెబితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు గతంలో ప్రకటించారు.
ఎర్రకోట హింసా కేసులో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు .. ఆచూకీ చెప్తే రివార్డులు
అయితే ఆయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి కావటంతో అరెస్ట్ చెయ్యటం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీప్ సిద్ధూ అరెస్ట్ కోసం పోలీసులపై , కేంద్రంపై ఒత్తిడి కూడా పెరిగింది. ఇక ఇదే సమయంలో ఈ కేసులో నిందితులైన సుఖ్ దేవ్ సింగ్, బూటాసింగ్, జజ్బీర్ సింగ్, ఇక్బాల్ సింగ్ ల ఆచూకి చెప్పినవారికి 50 వేల చొప్పున నగదు బహుమతి ఇస్తామని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం జాయింట్ కమిషనర్ బికేస్ అని చెప్పారు. ఈ కేసును వికే సింగ్ నేతృత్వంలోని డి సి పి లు బేషం సింగ్, మోనిక భరద్వాజ్ , జాయ్ టర్కీలు దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ హైకోర్టు కేంద్రంతో పాటు ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు .. అప్పటి నుండి గాలింపు
రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రంతో పాటు ఢిల్లీ పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో దాడికి బాధ్యులైన వీరి కోసం అప్పటి నుంచి గాలింపు చేపట్టారు. ఫైనల్ గా ఈ రోజు అరెస్ట్ చేశారు . దీప్ సిద్ధు స్నేహితుడు కాలిఫోర్నియా నుంచి ఫేస్బుక్ వీడియోలను అప్లోడ్ చేస్తాడని, అతని ప్రస్తుత ఐపీ చిరునామాను పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారని డీసీపీ స్పెషల్ సెల్ తెలిపింది. రిపబ్లిక్ దినోత్సవం రోజున హింస జరిగిన ఒక రోజు తరువాత, ఈ సంఘటనకు మతపరమైన రంగు ఇవ్వకూడదని నిరసనకారులను ఫండమెంటల్ లిస్టులుగా పిలవాలని ఫేస్బుక్ వీడియోను అప్లోడ్ చేశారు.