నరకం చూస్తున్నా: సౌదీలో పంజాబీ మహిళ వేడుకోలు(వీడియో)
న్యూఢిల్లీ: ఉపాధి కోసం వెళితే.. అక్కడ మాత్రం మనషులుగా కూడా చూడరు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మాత్రం మరీ దయనీయంగా ఉంటుంది. తాజాగా తాను అనుభవిస్తున్న నరకాన్ని ఓ వీడియో ద్వారా తెలిపి తనను కాపాడమంటూ వేడుకుంది సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ పంజాబీ మహిళ.
చిత్రహింసలు
తాను అనుభవిస్తున్న చిత్రహింసలను తెలియజేస్తూ తనను కాపాడాలంటూ ఓ వీడియోలో ఆమె వేడుకుంది. ఆ వీడియో ప్రకారం.. సౌదీ అరేబియా రాజధాని రియాద్కు 200 కిలోమీటర్ల దూరంలోని దవాద్మీ పట్టణంలో తాను పనిచేస్తున్నానని, నిరుపేద కుటుంబానికి చెందిన తాను ఉపాధి కోసం ఏడాది కిందట సౌదీకి వచ్చానని ఆమె తెలిపారు.
నరకం నుంచి కాపాడాలంటూ
తనను ఈ నరకకూపం నుంచి ఎలాగైనా కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ ఆమె విజ్ఞప్తి చేశారు. ‘భగవంత్ మాన్ సాబ్ దయచేసి నాకు సాయం చేయండి. నేను ఇక్కడ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా. ఎంతో వేదనలో ఉన్నా. గత ఏడాదిగా నన్ను హింసిస్తున్నారు. మీరు హోషియార్పూర్ యువతిని కాపాడారు. నన్ను కూడా కాపాడండి. నేను మీ కూతురు లాంటి దానిని. నన్ను కాపాడండి' అని వేడుకుంది.
బందీనయ్యా.. హింసిస్తున్నారు..
‘నేను ఇక్కడ బంధీ అయ్యాను. నాకు ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు' అంటూ ఆమె కన్నీళ్లపర్యాంతమైంది. అంతేగాక, తనకు సౌదీ పోలీసులు కూడా తనకు సాయం చేయడం లేదని వాపోయింది. తన యజమాని తనను ఓ గదిలో బంధించి శారీరకంగా హింసిస్తున్నాడని, కొన్నిరోజులుగా తనకు ఆహారం కూడా ఇవ్వడం లేదని ఆమె తన వేదనను వివరించింది.
అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినా..
సాయం కోసం పోలీసుల వద్దకు వెళితే.. వాళ్లు తనను కొట్టి.. మళ్లీ ఆ ఇంట్లోకి తరిమేశారని తెలిపింది. 20-22 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న బాధితురాలు.. తనకు పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని, తన తల్లి బాగా లేదని, ఆమెను వెంటనే చూసేందుకు తాను స్వదేశం వచ్చేలా సాయం చేయాలని వేడుకుంది.
ఎవరూ రావొద్దు..
పంజాబీలు ఎవరూ సౌదీ అరేబియాకు రావొద్దని, ఇక్కడి వారు పెద్ద మూర్ఖులని ఆమె తెలిపింది. కాగా, ఈ పంజాబీ మహిళ వీడియోపై ఎంపీ భగవంత్ మాన్ ఇంకా స్పందించలేదు. అయితే, ఈ వీడియో ఆయన వరకు చేరిందో లేదో తెలియదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.