సర్దుబాటు ధోరణి: పారికర్ స్థానం కోసం పురందేశ్వరి పాట్లు? కేంద్రమంత్రి అల్ఫోన్స్ నుంచి పోటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉత్తర ప్రదేశ్ రాజకీయాలకు తరలి వెళుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. మాజీ రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా సీఎం మనోహర్ పారికర్ గత ఆగస్టులో రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును బీజేపీలో ఎవరూ ఆశించడం లేదని తెలుస్తోంది. దీనికి మరో కారణం కూడా ఉంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి యోచిస్తున్నట్లు సమాచారం.
Recommended Video
బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఈ స్థానం నుంచి దగ్గుబాటి పురందేశ్వరి అభ్యర్థిత్వాన్నే ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి కన్నంథానం అల్ఫోన్స్ అభ్యర్థిత్వాన్ని కూడా బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు వినికిడి.
పారికర్ సీటుపై ఆసక్తే చూపని కమలనాథులు
కానీ కేంద్రంలోనూ, 19 రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చలాయిస్తున్న కమలం పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ నుంచి మనోహర్ పారికర్ ఖాళీచేసిన రాజ్యసభ సీటును దక్కించుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. మూడున్నరేళ్ల క్రితం గోవా సీఎంగా ఉన్న మనోహర్ పారికర్ ను స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ తన క్యాబినెట్ లోకి తీసుకుని రక్షణశాఖ మంత్రిగా నియమించారు. కానీ గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ రాకున్నా.. గెలుపొందిన స్వతంత్ర సభ్యుల షరతుల మేరకు.. బీజేపీని తిరిగి అధికారంలో కొనసాగేలా చూసుకునేందుకు పారికర్ మళ్లీ గోవా సీఎంగా వెళ్లిపోయారు.
2020 వరకు పారికర్ సీటు పదవీ కాలం
కనుక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పారికర్ రాజీనామా చేసిన స్థానం పదవీ కాలం రెండున్నరేళ్లు ఉన్నది. పార్టీలో ఏదైనా పదవి ఖాళీగా ఉందంటే ఆశావహులు భారీగా పైరవీలకు దిగుతుంటారు. కానీ పారికర్ వదిలివెళ్లిన రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకురావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ సీటుకు గడువు 2020, నవంబర్ వరకు ఉంది. పూర్తికాలం కొనసాగే పదవులు చేపట్టే అవకాశం ఉండగా స్వల్పకాలిక పోస్ట్ ఎందుకున్న భావనతో ఆశావహులు ఉన్నట్టు కనబడుతోంది. అందుకే బీజేపీ నేతలెవ్వరూ దీనికోసం పోటీ పడటం లేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలాబలాల పరిగణనలో తీసుకుంటే లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందే సీటు లభించే అవకాశాలు లేవు. ఒకవేళ రాజ్యసభకు ఎన్నికైతే 2019లో మోదీ తిరిగి అధికారంలోకి వస్తే క్యాబినెట్ లో చోటు దక్కించుకోవచ్చునని పురందేశ్వరి యోచిస్తున్నట్లు సమాచారం.
ఆరు నెలలు ఓపిక పడితే సరి
ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 403 సీట్లు గల శాసనసభలో కమలదళం బలం 325కు పెరగడంతో రాష్ట్రంలో ఎనిమిది రాజ్యసభ సీట్లు బీజేపీకికి దక్కనున్నాయి. మరో ఆరు నెలల్లో ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఈ ఆరు నెలలు ఓపిక పడితే ఆరేళ్ల పదవి సొంతమవుతుందన్న భావనతో పరీకర్ సీటును ఎవరూ ఆశించడం లేదు. ‘రెండేళ్ల రాజ్యసభ సీటు పట్ల ఆశావహులు ఆసక్తి చూపడం లేదు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న యూపీలోని పది రాజ్యసభ సీట్ల కోసమే పైరవీలు చేస్తున్నార'ని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
పారికర్ స్థానానికి పోటీ పడకపోవడానికి కారణాల వెల్లడికి నిరాకరణ
ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలెవ్వరూ పారికర్ సీటుపై ఆసక్తి చూపడం లేదన్న ప్రచారాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్ బహదూర్ పాఠక్ తోసిపుచ్చారు. ఖాళీ అయిన సీటును ఎవరికి కేటాయించాలనేది తమ పార్టీ పార్లమెంటరీ సెంట్రల్ బోర్డు నిర్ణయిస్తుందని చెప్పారు. త్వరలోనే అభ్యర్థిని ఎంపిక చేస్తుందని తెలిపారు. పారికర్ సీటు కోసం తమ పార్టీ నేతలు ఎందుకు పైరవీలు చేయడం లేదనే దానికి కారణం లేదన్నారు. ఈ సీటును కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి కన్నంథానం అల్ఫోన్స్కు కేటాయించే అవకాశముందని లక్నో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఎన్నిక జరగనున్న ఈ స్థానంలో అభ్యర్థిని నిలిపేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది.
పదో సీటు కోసం ఎస్పీకి ఇతరుల మద్దతు తప్పనిసరి
యూపీలో వచ్చే ఏడాది ఖాళీ కానున్న 10 రాజ్యసభ సీట్లలో బీజేపీ సొంత బలంతో కనీసం ఎనిమిదింటిని దక్కించుకుంటుంది. 47 మంది ఎమ్మెల్యేలు కలిగిన సమాజ్వాదీ పార్టీ ఒక సీటు గెలిచే అవకాశముంది. పదో సీటును ప్రతిపక్షాలు దక్కించుకోవాలంటే సమాజ్వాదీ పార్టీకి బీఎస్పీ(19), కాంగ్రెస్(7), ఆర్ఎల్డీ (1) మద్దతు అవసరమవుతుంది. యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 37 ప్రథమ ప్రాధాన్య ఓట్లు అవసరం.