జగన్నాథుని రథయాత్ర: భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు
భువనేశ్వర్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర(141వ)కు పూరీ శ్రీక్షేత్రం సిద్ధమైంది. శనివారం పూరీ జగన్నాథుడు భక్త జనఘోష మధ్య బలభద్ర, సుభద్రలతో కలసి రథాలపై గుండిచా(పెంచినతల్లి) మందిరానికి చేరుకోనున్నాడు. ఈ యాత్ర తిలకించడానికి యాత్రికులు శుక్రవారమే పెద్ద సంఖ్యలో పూరీ చేరుకున్నారు.
దేశ, విదేశాల నుంచి చేరుకుంటున్న భక్తులతో మఠాలు, ఆశ్రమాలు, ధర్మశాలలు, హోటళ్లు నిండిపోయాయి. స్నానయాత్ర (జ్యేష్ట పూర్ణిమనాడు) వేడుకలో జలక్రీడలాడిన చతుర్థామూర్తులు (జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు) అస్వస్థతకులోనై పక్షం రోజులపాటు ఒనొసొనొ (చీకటి) మందిరంలో చేరిన విషయం తెలిసిందే.
ఇక్కడే స్వామికి గోప్య చికిత్స, సేవలు జరిగాక ఆరోగ్యవంతుడై శుక్రవారం నవయవ్వన రూపంలో (నేత్రోత్సవం) భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ శుక్ల విదియనాడు(శనివారం) ముగ్గురు మూర్తులు నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై గుండిచాదేవి మందిరానికి చేరుకుంటారు. కాగా, అక్కడ తొమ్మిది రోజులు విడిది చేయనున్నారు.
ఇప్పుడు పూరి క్షేత్రమంతా జగన్నాథుడి నామస్మరణత మారుమ్రోగిపోతోంది. రథయాత్ర నేపథ్యంలో శనివారం నిర్ణీత వేళల్లో పురుషోత్తమ సేవలు ఏర్పాటయ్యేలా శ్రీక్షేత్ర యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఒడిశా ప్రభుత్వం రథయాత్రను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జగన్నాథుడి యాత్ర నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.