ట్రింగ్.. ట్రింగ్ బదులు కరోనా వైరస్ గురించి సందేశం, మొబైల్ కంపెనీలకు టెలీకాం శాఖ ఆదేశాలు..
కరోనా వైరస్తో ప్రపంచమంతా అప్రమత్తమైంది. నివారణ చర్యలు తీసుకుంటోంది. భారత్లో కూడా 33 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ గురించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర టెలికాం శాఖ కీలక చర్య తీసుకుంది. మొబైల్ రింగ్టోన్లో కరోనా వైరస్ గురించి చెబుతోన్నారు. దీంతో ప్రజలకు వైరస్ గురంచి అలర్ట్ అవుతారని భావిస్తున్నారు.
కరోనా రింగ్ టోన్..
కరోనా వైరస్ గురించి అప్రమత్తం చేసే క్లిప్పింగ్ను కేంద్ర ప్రభుత్వం టెలీకాం శాఖకు అందజేసింది. దీంతో ప్రతీ ఒక్కరి మొబైల్ ఫోన్కు రింగ్ టోన్ బదులు కరోనా వైరస్ గురించిన సందేశం వినిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర టెలీకాం మంత్రిత్వ శాఖ దేశంలోని మొబైల్ కంపెనీలు విధిగా రింగ్ టోన్ పెట్టుకోవాలని శుక్రవారం సూచించింది. తమ తదుపరి ఉత్తర్వు వచ్చేవరకు రింగ్ టోన్ కొనసాగాలని అందులో స్పష్టంచేసింది. అయితే సాధారణంగా మనం ఫోన్ చేసే సమయంలో రింగ్ టోన్ బదులు.. కరోనా వైరస్ గురించి వినిపిస్తోంది. అయితే కొందరు రింగ్ టోన్ పెట్టుకొన్న వినియోగదారులు మాత్రం.. వారి పాటలే వినిపిస్తాయని ఒక టెలీకాం కంపెనీ స్పష్టంచేసింది.
వర్క్ ఫ్రం హోం
కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పేటీఎం, ట్విట్టర్ సహా ఇతర కంపెనీలకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. రిలయన్స్ జియో కూడా వర్క్ ఫ్రం ఇచ్చింది. అయితే వారికి బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి.. ఇందుకోసం ఇంటర్నల్ యాప్ రూపొందించి.. అటెండెన్స్ తీసుకున్నారు. ఒక ఓలా కంపెనీ అయితే తమ డ్రైవర్ పార్ట్నర్లకు మాస్క్లు, సానిటైజర్స్ అందజేస్తోంది.
డ్రైవర్లకు అందజేసిన సానిటైజర్లతో వాహనాలు శుభ్రంగా ఉంటాయని, మాస్క్ ధరించడంతో ప్రయాణికులకు సురక్షితమైన జర్నీ అందించగలమని ఓలా ఒక ప్రకటనలో పేర్కొన్నది. అంతర్గత సంప్రదింపుల కోసం టాస్క్ఫోర్స్ కమిటీని నియమించినట్టు తెలిపింది.
33 పాజిటివ్ కేసులు
దేశంలో ఇప్పటివరకు 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 57 ల్యాబుల్లో కరోనా వైరస్ టెస్టులను నిర్వహిస్తున్నారు. మార్చి 6వ తేదీ వరకు 3 వేల 404 మంది నుంచి 4 వేల 58 శాంపిల్స్ సేకరించామని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీరిలో 654 మంది వుహాన్ నుంచి వచ్చినవారేనని పేర్కొన్నది.