పేదలు, వలసకూలీల ఖాతాల్లో నగదు జమచేయండి, కేంద్రానికి రాహుల్ సూచన
కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న పేదలు, వలసకూలీలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. నగదును నేరుగా వారి ఖాతాల్లో జమచేయడం వల్ల వారికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. లాక్ డౌన్ వల్ల పేదలు, కూలీల పరిస్థితి దయనీయంగా మారిందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. శనివారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
Recommended Video
7 నెలల గర్భిణీకి కరోనా వైరస్, యాదాద్రి జిల్లాలో కలకలం, భువనగిరి ఎయిమ్స్లో చికిత్స...
దేశంలో వలసకూలీల వెతలు మీడియాలో చూస్తున్నామని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. వారికి ఇప్పుడు చేయూతనివ్వాలని.. తర్వాత కాదు అని స్పష్టంచేశారు. పేదల ఖాతాల్లోనే నగదు జమచేయాలని... లేదంటే వారికి ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు. లక్షలాది మంది వలసకూలీలు రోడ్లపై మనీ లేకుండా, ఆహారం లేకుండా పడుతున్న ఇబ్బందులను చూసి మనసు కలచివేస్తుందని చెప్పారు.
కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో ఏ ఒక్కరిని విమర్శించాల్సిన అవసరం లేదన్నారు రాహుల్ గాంధీ. అందరూ చేయి చేయి కలిపి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఇది ఆదుకోవాల్సిన సమయం అని నొక్కి వక్కానించారు. అయితే లాక్ డౌన్ ఎత్తివేసే సమయంలో కూడా తెలివిగా వ్యవహరించాలని.. రాహుల్ గాంధీ కోరారు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన న్యాయ్ పథకం ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. న్యాయ్ పథకం కింద పేదల ఖాతాలో కొంత మొత్తం నగదు జమచేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. దీనిని శాశ్వతంగా కాకున్నా.. తాత్కాలికంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు.