రాజకీయ నేతల నేర చరిత గురించి పార్టీ వెబ్సైట్లో పొందుపర్చండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాజకీయ నాయకుల నేరచరితపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ నాయకులు నేతలపై ఉన్న క్రిమినల్ కేసులను ఆయా రాజకీయపార్టీలు తమ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చాలని పార్టీలకు సూచించింది. నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసి కూడా వారిని ఎందుకు పోటీచేసేందుకు పార్టీలు మొగ్గుచూపుతున్నాయో వివరించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఈ క్రమంలోనే రాజకీయాలు నేరాలతో నిండి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నాలుగు సాధారణ ఎన్నికల్లో పోటీచేసిన నేరచరిత కలిగిన నాయకులను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇకపై నేరచరిత కలిగిన నాయకులు, వారిపై ఉన్న క్రిమినల్ కేసులను వారి పేర్లతో సహా పార్టీ అధికారిక వెబ్సైట్తో పాటు సోషల్ మీడియాలో కూడా పొందుపర్చాలని ఇందుకు 48 గంటల పాటు సమయం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Recommended Video
ఇక ఇదే జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు 72 గంటలు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఒక పార్టీ నుంచి అభ్యర్థిని బరిలో నిలిపే సమయంలో అతని మెరిట్ను పరిగణలోకి తీసుకోవాలి తప్ప అతను గెలిచే అవకాశాలపై కాదని కోర్టు మరో కీలక వ్యాఖ్య చేసింది.
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఆయా పార్టీలు పాటించకపోయినా.. లేదా సుప్రీం సూచనలను ఎన్నికల సంఘం అమలు చేయలేకపోయినా... అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని న్యాయమూర్తులు చెప్పారు. కోర్టు ధిక్కారణ కింద లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ మరియు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారణ చేసిన అత్యున్నత ధర్మాసనం పై ఆదేశాలు ఇచ్చింది.
నేరచరిత ఉన్న రాజకీయనాయకులను తీవ్రమైన నేరాలకు పాల్పడిన నాయకులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించేలా చట్టం తీసుకురావాలని 2018లో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు వారిని పార్టీ సభ్యులుగా కూడా చేర్చుకోరాదంటూ ఆదేశాలు ఇచ్చింది.