మెమన్ను ఉరితీసిన తలారికి రూ.10 వేల చెక్
పుత్తూరు: ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ను ఉరితీసిన తలారికి కర్ణాటకకు చెందిన ఒక విద్యార్ది సంఘం రూ. 10 వేల చెక్ను పంపించారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న యాకుబ్ మెమన్ లాంటి వ్యక్తిని ఉరి తీసిన తలారిని గౌరవించాలని భావించిన విద్యార్థి సంఘం పూత్తూరులోని అంబికా పదవి పూర్వ విద్యాలయ యాజమాన్యానికి తమ ఆలోచనను తెలిపింది.
దీంతో యాజమాన్యం మహారాష్ట్రలోని నాగ్పూర్ జైలు అధికారులను సంప్రదించారు. దానికి వారు అంగీకరించడంతో విద్యార్ధి సంఘం... ప్రతి క్లాసు నుంచి స్వచ్ఛంద విరాళాలను సేకరించారు. అలా సేకరించిన మొత్తాన్ని చెక్కురూపంలో పంపిస్తూ తలారికి అందజేయాల్సిందిగా మహారాష్ట్ర డీజీపీకి పంపారు.
అంతేకాకుండా, ఈ పని చేయడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని డీజీపీకి లేఖ రాశారు. ఈ రూ. 10వేల చెక్కుని తలారికి అందజేయాలని కోరారు. ఇక (జులై 30) గురువారం మహారాష్ట్రలోని నాగపూర్ జైల్లో అతడికి ఉరిశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. ఆరోజు ఉదయం 6.43 గంటలకు ఉరిశిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే.
ఉరి తీసిన తర్వాత యాకుబ్ మెమెన్ మరణించినట్లుగా వైద్యులు సరిగ్గా ఉదయం 7.01 గంటలకు ప్రకటించారు. అనంతరం యాకుబ్ మెమన్ మృతదేహానికి జైల్లోనే పోస్టుమార్టం నిర్వహించి, నాగాపూర్ నుంచి ముంబైకి విమానంలో అతన్ని మృతదేహాన్ని తీసుకువచ్చారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన సంగతి తెలిసిందే.
1993లో ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి. ఈ వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. 7 వందల మంది వరకు గాయపడ్డారు.. ఈ కేసులో టైగర్ మెమన్ (యాకూబ్ సోదరుడు), దావూద్ ఇబ్రహీం పేలుళ్లలో ప్రధాన సూత్రధారులు. దీంతో 2007లో ముంబైలోని టాడా కోర్టు మెమన్తో సహా 11 మందికి ఉరిశిక్ష విధించింది.