డీఎల్ఎఫ్ మల్టీప్లెక్స్ భవనం టెర్రస్ పై పీవీఆర్ సినిమాస్ ఉద్యోగి మృతదేహం..రక్తపు మడుగులో..!
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ బుధ నగర జిల్లా నొయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పీవీఆర్ సినిమాస్ సంస్థ ఉద్యోగి మృతదేహం ప్రముఖ మల్టీ ప్లెక్స్ భవనం టెర్రస్ పై కనిపించింది. తలకు తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో కనిపించిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి.. దీన్ని హత్యగా అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టమ్ నివేదిక తరువాత పూర్తి వివరాలు అందుతాయని వెల్లడించారు.
నొయిడాలోని సెక్టార్ 18లో గల ప్రముఖ డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా మల్టీ ప్లెక్స్ భవన సముదాయం టెర్రస్ పై ఈ మృతదేహం శుక్రవారం లభించింది. మృతుడిని భువన చంద్రగా గుర్తించారు. అదే మల్టీ ప్లెక్స్ లో గల పీవీఆర్ సినిమాస్ సంస్థలో అతను పని చేస్తున్నట్లు నిర్ధారించారు. తలకు తీవ్ర గాయం కావడం, రక్తపు మడుగులో నిర్జీవంగా భువనచంద్ర మృతదేహం కనిపించింది. స్వీపర్లు అతని మృతదేహాన్ని తొలుత గుర్తించారు. వెంటనే మల్టీ ప్లెక్స్ నిర్వాహకులకు సమాచారాన్ని ఇచ్చారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే గౌతమ బుద్ధ నగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నవనీత్ జైస్వాల్ సహా పలువురు పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం నొయిడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల మీద భారీ గాయం కావడం వల్ల రక్తస్రావం చోటు చేసుకుందని, దానివల్ల భువన చంద్ర మరణించి ఉంటాడని తాము ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఎస్పీ నవనీత్ జైస్వాల్ తెలిపారు. పోస్ట్ మార్టమ్ నివేదిక అందిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పారు.
భువనచంద్ర తలకు వెనుక భాగంపై ఏదైనా భారీ వస్తువుతో కొట్టినట్టుగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి చూస్తే.. గుర్తు తెలియని వ్యక్తులు భువన చంద్రను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. టెర్రస్ పై సీసీటీవీ కెమెరాలు లేవని, దీన్ని దుండగులు తమకు అనుకూలంగా మార్చుకుని ఉండొచ్చని చెప్పారు. అయినప్పటికీ.. ఎవరెవరు టెర్రస్ పైకి రాకపోకలు సాగించారు? బయటి వ్యక్తుల ప్రమేయం ఉందా? లేక తోటి ఉద్యోగులే భువనచంద్రను హతమార్చారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తామని అన్నారు.