జింకను మింగిన కొండచిలువ: చివరకు ఎలా చనిపోయిందో చూడండి
గాంధీనగర్: అత్యాశ చేటు అనే సామెత ఈ కొండ చిలువకు సరిగ్గా సరిపోతుంది. ఎక్కువ పరిమాణంలో ఉన్న ఓ కృష్ణ జింకని కొండ చిలువ మింగింది. తాను మింగిన కృష్ణ జింక దాని పొట్టకు సరిపోక పోవడంతో చివరకు ప్రాణాలు విడించింది. గుజరాత్లోని గిర్ వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గిర్ వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో జగన్నాధ్ జిల్లాలోని బలియవాడ్ గ్రామంలో 20 అడుగుల పొడవైన కొండచిలువ పెద్ద కృష్ణ జింకను మింగింది. అనంతరం దానిని అరిగించుకోవడంలో విఫలమై కదలలేక రోడ్డుపై పక్కన పడి నానా అవస్థలు పడింది.
ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వచ్చి దాన్ని తీసుకెళ్ళి ఓ ఎన్క్లోజర్లో ఉంచారు. అయితే స్థాయికి మించిన ప్రాణిని అది మింగడంతో జీర్ణించుకోలేక చివరకు మృత్యువాత పడిందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
సాధారణంగా కొండచిలువలు ఏదైనా జంతువును అహారంగా తీసుకున్నప్పుడు అది జీర్ణం కావడానికి కొన్ని వారాలు, ఒక్కోసారి నెలకుపైగా పడుతుంది. అప్పటి వరకు అవి ఆహారం తీసుకోవు. అయితే భారీ పరిమాణంలో ఉన్న కృష్ణ జింకను మింగడం మూలంగా కొండచిలువ లోపలే గాయాలయ్యాయని అందుకే అది మరణించిందని అధికారులు వెల్లడించారు.