దిగ్గజ దేశాల క్వాడ్ మంత్రివర్గ భేటీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపధ్యంలో చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్
ఇండియా చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఏం జరిగినా ఒక ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది. ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యాన్ని ఢీ కొట్టడం కోసం దిగ్గజ దేశాలైన భారత్, ఆస్ట్రేలియా, జపాన్ ,యూఎస్ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నుంచి చైనాపై రగిలిపోతున్న దేశాలు ఇప్పుడు భారత్-చైనా దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణం సమయంలో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
న్యూఢిల్లీలో భారతదేశం, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మధ్య క్వాడ్ సమావేశం
న్యూఢిల్లీలో భారతదేశం, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మధ్య జరగబోయే క్వాడ్ మంత్రివర్గ సమావేశం చైనాకు బలమైన సంకేతాలు పంపుతుందని సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో ఒక బలమైన శక్తిగా అన్ని దేశాలు చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి సన్నద్ధం అవుతున్నాయి. మరోవైపు యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్రిలేటరల్ భద్రతా ఒప్పందం లో కూడా కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ తో కలిసి ప్రపంచ వాణిజ్యంలో చైనా అధిపత్యం పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అవుతున్నాయి.
చైనాపై రగిలిపోతున్న దిగ్గజ దేశాలు
కరోనా వైరస్ కారణం చైనా అని ఆస్ట్రేలియా దర్యాప్తు కోరిన నేపథ్యంలో, ఆస్ట్రేలియాపై చైనా ఆర్థిక ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించింది. ఇక జపాన్ విషయంలో సెంకాకు దీవుల చుట్టూ ఉన్న సముద్రాన్ని ఆక్రమించడానికి చైనా అవిశ్రాంతంగా ప్రయత్నం చేసింది. అమెరికా విషయానికొస్తే కరోనా వైరస్ వ్యాప్తి తో అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయడమే కాకుండా, అమెరికన్ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, మేధో సంపత్తిని గూఢచార వ్యవస్థ ద్వారా చోరీ చేసే ప్రయత్నం చేసింది చైనా అని అమెరికా మండిపడుతుంది. ఇదే సమయంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది.
ఇండియాతో సరిహద్దు వివాదాలను ఆపని చైనా
ఇండియా విషయానికి వస్తే లద్దాఖ్ వద్ద సరిహద్దులను మార్చే ప్రయత్నం చేసి కయ్యానికి కాలు దువ్వుతుంది. సరిహద్దులను దాటి చొరబాటుకు యత్నం చేస్తూనే తాము నియంత్రణ రేఖ దాటి రావటం లేదని బుకాయిస్తుంది. చర్చలలో ఒకలా , బయట ఇంకోలా డ్రాగన్ తన దుర్బుద్ధిని చూపిస్తుంది. ప్రస్తుతం చైనా దాదాపు చాలా దేశాలతో తగవులకు దిగుతున్న నేపథ్యంలో చైనాకు బుద్ధి చెప్పడం కోసం దిగ్గజ దేశాలు ఒకటిగా ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
వాణిజ్య పరంగా చైనాకు చెక్ పెట్టే ప్లాన్ లో భేటీ
ఈ నేపథ్యంలోనే నలుగురు విదేశాంగ మంత్రులు కలిసికట్టుగా వ్యవహరించాలని వాణిజ్యపరంగా చైనాను ఢీ కొట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. చైనా పై ఆధార పడడాన్ని తగ్గించాలని భారత్ ,ఆస్ట్రేలియా మరియు జపాన్ సెప్టెంబర్ 1న సప్లై చైన్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగానే ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నూతన సాంకేతికత కోసం ఇండియా తో కలిసి మూడు దేశాలు కలిసి పనిచేయనున్నాయని, తమ విధానాలు నచ్చితే ఏ దేశమైనా తమతో కలిసి పనిచేయవచ్చని దేశాల ప్రతినిథులు పేర్కొన్నారు.
Recommended Video
ప్రణాళికా బద్ధంగా , కలిసికట్టుగా చైనాతో ఢీ
ప్రస్తుతం తయారీ రంగంలో అత్యధిక ఎగుమతులనుచైనా చేస్తుంది. మరోవైపు ఫార్మాకు కావాల్సిన ముడిసరుకులను ప్రపంచ దేశాలకు చైనా నుంచే ఎగుమతి అవుతున్నాయి. దీంతో వాణిజ్యపరంగా చైనా ప్రపంచ మార్కెట్ ను శాసిస్తుంది . దీనికి చెక్ పెట్టాలని, అందుకోసం అన్ని దేశాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇండియా చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం నాలుగు దేశాల మధ్య జరగనున్న ఈ సమావేశం చైనాకు గట్టి వార్నింగ్ గా ఉంటుందని భావిస్తున్నారు.