పార్లమెంటులో క్వశ్చన్ అవర్: విపక్షాల ఆందోళన, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేశినేని నాని
న్యూఢిల్లీ: బుధవారం ఉదయం 11గంటలకు వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోకసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్ సుమిత్రా మహాజన్.
కాగా, విపక్షాలు సభ ప్రారంభమైన వెంటనే ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.
అయినా, విపక్షాలు పట్టు వీడకుండా ఆందోళనలను కొనసాగించాయి. మరో వైపు టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలంటూ నినాదాలతో హోరెత్తించారు. విభజన హామీలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. క్వశ్చన్ అవర్ తర్వాత అంశాలవారీగా చర్చిస్తామని చెప్పినప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళనలను విరమించుకోలేదు.
ఎక్కడా తగ్గొద్దు, కుట్రలతో జాగ్రత్త!, అంతా గమనిస్తా: టీడీపీ ఎంపీలకు తేల్చేసిన చంద్రబాబు
స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. విపక్షాలు ఆందోళన చేస్తున్నప్పటికీ.. స్పీకర్ క్వశ్చన్ అవర్ కొనసాగించారు. ఇది ఇలావుంటే, పార్లమెంటు ఆవరణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు ఏపీకీ ప్రత్యేక కావాలంటూ నిరసనలు చేపట్టారు.
రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన కొనసాగుతోంది.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేశినేని: పదిరోజుల్లో ప్రకటిస్తామన్న స్పీకర్
లోకసభ సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. కాగా, టీడీపీతోపాటు సహా పలు పార్టీల అవిశ్వాస తీర్మానాలు అందాయని స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు.నిబంధనల ప్రకారమే అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
టీడీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందని తెలిపారు. అవిశ్వాసంపై మొదట నోటీసు ఇచ్చిన వారికే తొలి అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పారు. అవిశ్వాసంపై చర్చ తేదీని పది రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. కాగా, అవిశ్వాసంపై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే, తమ అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోలేదని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు.