పరీక్ష పేపర్ లలో పార్టీలపై , పార్టీ నేతలపై ప్రశ్నలు .. మొన్న ఏపీ నేడు బెంగుళూరు ఇదెక్కడి రాజకీయం
దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న వేళ ప్రశ్నాపత్రాల్లో రాజకీయ ప్రశ్నలు సంచలనంగా మారాయి. మొన్నటికి మొన్న ఏపీలో తెలుగుదేశం పార్టీ గురించి రాయమని ప్రశ్న ఇస్తే , తాజాగా బెంగుళూరులోని ఒక స్కూల్ లో 8వ తరగతి ప్రశ్నా పత్రంలో రైతులకు మిత్రుడు ఎవరు అని వరుసగా రాజకీయ నాయకుల పేర్లు ఇవ్వటం సంచలనం గా మారింది. ఈ ప్రశ్నా పత్రం సోషల్ మీడియా లో వైరల్ కావటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది .
అనంతపురంలో ఆ పరీక్షల్లో అవాక్కయ్యే ప్రశ్న ... తెలుగుదేశం పార్టీ గురించి రాయండి
పరీక్షల్లో అవాక్కయ్యే ప్రశ్న .. రైతులకు మిత్రులు ఎవరు ? యడ్యూరప్పనా , కుమారస్వామి నా , వానపాములా
మౌంట్ కార్మెల్ స్కూల్ లో 8వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో విద్యార్థులను అడిగిన ఓ ప్రశ్న... రైతులకు మిత్రులు ఎవరు? అంతవరకూ బాగానే ఉంది. ఆ ప్రశ్నకు జవాబుగా ఇచ్చిన ఆప్షన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ఆప్షన్స్ గా A. కుమారస్వామి, B. వానపాములు, C. యడ్యూరప్ప అని ఇచ్చారు. విద్యార్థులు సరిగ్గానే 'వానపాములు' అన్న ఆప్షన్ ను ఎంచుకున్నారు. ఇక ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టటంతోనే అసలు సమస్య మొదలైంది.
సోషల్ మీడియా లో ప్రశ్నాపత్రం వైరల్ ... ఉద్యోగం పోగొట్టుకున్న టీచర్
విద్యార్థులకు పరీక్షల్లో అలాంటి ఆప్షన్స్ ఇవ్వడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. స్కూల్ లో రాజకీయాలు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు . దీంతో స్కూల్ యాజమాన్యం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అత్యుత్సాహంతో అనాలోచితంగా ప్రశ్న ఇచ్చిన టీచర్ పై వేటు పడింది. ఆ టీచర్ ను తొలగించి తాము ఏ రాజకీయ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది సదరు స్కూల్ యాజమాన్యం .
మొన్న ఏపీలోనూ టీడీపీ గురించి రాయమని ప్రశ్న ఇచ్చిన వైనం
ఇక మొన్నటికి మొన్న
ఏపీలోని అనంతపురం జిల్లాలో బీఏ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అవాక్కయ్యే ప్రశ్నాపత్రం ఇచ్చారు. పొలిటికల్ సైన్సు ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఒక ప్రశ్నలో తెలుగుదేశం పార్టీ గురించి రాయండి అని ఉండడం విద్యార్థులను అవాక్కయ్యేలా చేసింది. అటు విద్యార్థులే కాదు, ఆ ప్రశ్నాపత్రాన్ని చూసిన అధ్యాపకులు, తల్లిదండ్రులు సైతం అవాక్కయ్యారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనే కాదు .. విద్యా వ్యవస్థలో పడిపోతున్న విలువలకు ఉదాహరణలు
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి ప్రశ్నలు , ప్రశ్నా పత్రాల్లో ఉండడం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్కూల్స్ లో, కాలేజీల్లో విద్యార్థులపై ప్రభావం చూపేలా రాజకీయాలకు సంబంధించి ప్రశ్నలు ఇవ్వటం విద్యా వ్యవస్థలో పడిపోతున్న విలువలకు నిదర్శనం . ఈ పరిస్థితులు మారాలంటే విద్యా సంస్థల యాజమాన్యాలు రాజకీయాలకు అతీతంగా తమ విద్యా సంస్థలు నిర్వహించాలి.