ఉత్తరాదిలో ఈవీఎంల కలకలం.. నాలుగు రాష్ట్రాల్లో నిరసనలు.. ఈసీ ఏం చెప్పిందంటే..
Recommended Video
ఫలితాలకు సమయం దగ్గరపడేకొద్దీ ఎన్నికల సంఘం సరికొత్త వివాదాల్లో కూరుకుపోతోంది. ఈవీఎంల తరలింపు విషయంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. యూపీ, బీహార్, పంజాబ్, హర్యానాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. కౌంటింగ్కు రెండు రోజుల ముందుకు ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తీసుకొచ్చిన వీడియోలు కలకలం సృష్టించాయి.
వీవీప్యాట్ లెక్కింపు పిటీషన్: నాన్సెన్స్! : సుప్రీంకోర్టు అసహనం
రెండు రోజుల తర్వాత స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలు
మోడీ పోటీ చేస్తున్న ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో ఈవీఎంల తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చందౌలీ నియోజకవర్గంలో ఆదివారం పోలింగ్ ముగియగా.. సిబ్బంది మంగళవారం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్కు తీసుకువచ్చారు. పోలింగ్ ముగిసిన రెండ్రోజుల తర్వాత ఈవీఎంలు తీసుకురావడంపై అధికారులను నిలదీశారు. దీనికి సంబంధించి సమాజ్వాదీ కార్యకర్తలు తీసిన వీడియో వైరల్ అయింది. దీంతో ఈ అంశంపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ అవి రిజర్వ్ యూనిట్లను ప్రకటించింది. వాటిని స్ట్రాంగ్ రూంలకు తరలించడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆలస్యమైందని వివరణ ఇచ్చింది.
ఈవీఎంలు మార్చుస్తున్నారని నిరసన
యూపీ ఘాజీపూర్లోనూ బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్ రూంల నుంచి ఓ వాహనంలో భారీ సంఖ్యలో ఈవీఎంలు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్ట్రాంగ్ రూం వద్ద బైఠాయించిన బీఎస్పీ అభ్యర్థి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న జిల్లా రిటర్నింగ్ అధికారి వారిని సముదాయించారు. పార్టీల ప్రతినిధులను స్ట్రాంగ్ రూంల వద్ద ఉండేందుకు అనుమతించడంతో ఆందోళన విరమించారు.
మరో మూడు రాష్ట్రాల్లోనూ
బీహార్, హర్యానా, పంజాబ్లోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తపై స్పందించిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలను ఎవరి కోసం తరలిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనల దృష్ట్యా ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్ ట్వీట్ చేశారు.
వదంతులేనన్న ఎలక్షన్ కమిషన్
పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈవీఎంలతో పాటు రిజర్వ్ యూనిట్లను స్ట్రాంగ్ రూంలకు తరలించాలని గత డిసెంబర్లో ఎలక్షన్ కమిషన్ సిబ్బందిని ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు వాటిని సాయుధ బలగాల భద్రతలో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో యూపీ, బీహార్, హర్యానా, పంజాబ్ ఘటనలపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఈవీఎంలను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తల్ని ఖండించింది. అవన్నీ వదంతులేనని, పటిష్ఠ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచామని స్పష్టం చేసింది.