జయలలిత మృతిపై దొరికిపోయారా: సంతకం నుంచి.. ఎన్నో డౌట్లు!
జయలలిత మృతిపై డీఎంకే చీఫ్ స్టాలిన్, పీఎంకే వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ రాందాస్ మంగళవారం పలు ప్రశ్నలు సంధించారు. అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం చికిత్స వివరాలు బహిర్గతం చేశారు.
చెన్నై: జయలలిత మృతి పైన డీఎంకే అధినేత స్టాలిన్, పీఎంకే వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ రాందాస్ మంగళవారం నాడు పలు ప్రశ్నలు సంధించారు. జయ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం పళనిస్వామి ప్రభుత్వం చికిత్స వివరాలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే.
మా కళ్లలో కారం కొట్టి, ఆమె ఎక్కడ: జయ మృతిపై బాంబు పేల్చారు
దీనిపై స్టాలిన్, రాందాస్లు వేర్వేరుగా స్పందించారు. జయకు చికిత్స అందించిన అపోలో విడుదల చేసిన హెల్త్ బులెటిన్లకు, ఎయిమ్స్ డాక్టర్ల నివేదికకు వ్యత్యాసం ఉందని స్టాలిన్ ఆరోపించారు.
ఆ రోజు పోషకహారం అని..
సెప్టెంబర్ 25వ తేదీన అపోలో డాక్టర్లు విడుదల చేసిన బులెటిన్లో జయ జ్వరం, పోషక ఆహార లోపంతో ఆసుపత్రిలో చేరారని, మరికొన్ని రోజుల్లో ఇంటికి చేరుకుంటారని తెలిపారని గుర్తు చేశారు.
ఇప్పుడు అపస్మారక స్థితిలో...
అదే సమయంలో తాజా ఎయిమ్స్ డాక్టర్ల నివేదిక ప్రకారం సెప్టెంబర్ 22న ఆసుపత్రిలే చేరే నాటికే ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పారని అనుమానాలు వ్యక్తం చేశారు. తాజా నివేదికలో పొంతన లేని సమాధానాలు చాలా ఉన్నాయన్నారు.
వేలిముద్రలు ఎలా..
పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్ కూడా ఎయిమ్స్ నివేదిక పైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఎయిమ్స్ డాక్టర్ల నివేదిక ప్రకారం అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి ఉప ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై వేలిముద్ర ఎలా వేశారని ప్రశ్నించారు.
పన్నీరు సెల్వం మాటేమిటి?
జయలలితకు ఎలాంటి చికిత్స అందించారో తనకు అవగాహన లేదని మాజీ సీఎం పన్నీరు సెల్వం చెప్పగా, అన్నీ ఆయనకు తెలుసునని తాజా నివేదికలో చెప్పారని అన్నారు. ఇందులో ఏది నిజమో చెప్పాలన్నారు.