ఒక్క క్యూ.. అన్ని క్యూ లైన్లకు ముగింపు పలుకుతుంది: మోడీ
భవిష్యత్తు భారతంలో 'క్యూ' లైన్ లో నిలుచోవడం అన్న ప్రస్తావన లేకుండా చేయకుండానే.. ప్రస్తుతం ఈ దేశంలో నోట్ల రద్దు 'క్యూ' అని అభివర్ణించారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ప్రతిపక్షాల ఆరోపణలను పరోక్షంగా తిప్పికొట్టేలా ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొరాదాబాద్ లో పార్టీ శ్రేణులు నిర్వహించిన పరివర్తన్ ర్యాలీ సందర్బంగా.. నోట్ల రద్దుపై మరోసారి స్పందించారు మోడీ. భవిష్యత్తు భారతంలో 'క్యూ' లైన్ లో నిలుచోవడం అన్న ప్రస్తావన లేకుండా చేయకుండానే.. ప్రస్తుతం ఈ దేశంలో నోట్ల రద్దు 'క్యూ' అని అభివర్ణించారు.
'చక్కెర కొనుక్కోవడం కోసం మనం క్యూ లైన్లో నిలబడుతాం. కిరోసిన్ కొనడం కోసం క్యూ లైన్లో నిలబడుతాం. గోధుమల కోసం క్యూ లైన్లో నిలబడుతాం. ఈ దేశాన్ని 60ఏళ్ల పాటు పాలించి.. ఇన్నాళ్లు వారి సమయాన్ని క్యూ లైన్లలో వృథా అయ్యేలా చేసినవారికి ధన్యవాదాలు' అంటూ పరోక్షంగా కాంగ్రెస్ పాలనను దుయ్యబట్టారు మోడీ.
'నా నిర్ణయంతో దేశంలో మొదలైన 'క్యూ' ఇకనుంచి అన్ని క్యూ లైన్లకు ఫుల్ స్టాప్ పెడుతుంది' అంటూ మోడీ తేల్చి చెప్పారు. ' ఈ దేశం అవినీతి మూలంగా వెనక్కి నెట్టివేయబడలేదా? ఈ అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం లేదా? ఈ అవినీతి దానికదే అంతమవుతుందా? దీన్ని వేళ్లనుంచి పెకిలించివేయాల్సిన అవసరం లేదా?' అంటూ తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారిపై పరోక్షంగా ప్రశ్నల వర్షం కురిపించారు మోడీ.
జన్ ధన్ పథకాన్ని ప్రారంభించినప్పుడు పేద ప్రజలెవరికి.. తొలుత దీని గురించి అర్థమవలేదని, మెల్లిమెల్లిగా వారు దీని గురించి తెలుసుకున్నారని మోడీ అభిప్రాయపడ్డారు. బ్లాక్ మనీ ఉన్నవారంతా ఇప్పుడు జన్ ధన్ ఖాతాలున్న వారి వద్దకు వెళ్లి రూ.2లక్షలు వారి ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారని మోడీ తెలిపారు.
నల్లకుబేరులు ఎప్పుడైనా పేద ప్రజలతో మాట్లాడడం చూశారా? అని ప్రశ్నించిన మోడీ.. ప్రస్తుతం వారంతా పేదవారి ఇళ్ల చుట్టే తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. నల్లకుబేరులు ఎవరైనా పేదవాళ్ల జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే.. వాటిని తిరిగి ఇచ్చేయవద్దని, అవి మీ ఖాతాల్లోనే ఉంటాయని మోడీ పేర్కొన్నారు. ఒకవేళ డబ్బు కోసం వారు మిమ్మల్ని బెదిరిస్తే.. నాకు లేఖ రాయండి అని సూచించారు.
నోట్ల రద్దు నిర్ణయం నల్లధనాన్ని వెలికితీయడం మాత్రమే కాదని రాబోయే రోజుల్లో నల్లధనానికి ఆస్కారం లేకుండా చేయడమని మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో దారిద్య్రం లేకుండా చేయాలంటే ముందుగా బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలపై ఫోకస్ చేయాలని, తమ ప్రభుత్వం అదే చేయబోతుందని మోడీ తెలియజేశారు.