‘నీ ఉద్యోగం పోయింది.. రేపట్నుంచి రావొద్దు’: టెక్కీకి హెచ్ఆర్ షాక్(ఆడియో)
బెంగళూరు: టెక్నాలజీ దిగ్గజ సంస్థలు తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తూ టెక్కీలకు వరుసగా షాక్లు ఇస్తున్నాయి. తాజాగా దేశీయ టెక్ దిగ్గజం టెక్ మహీంద్రాలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 'నీ ఉద్యోగం పోయింది. నీవు రేపటినుంచి ఆఫీసుకు రావొద్దు' అని ఓ ఉద్యోగికి సంస్థ నియామక(హెచ్ఆర్) అధికారులు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి.
కార్పొరేట్ నిర్ణయం
సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ఆ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ చెప్పడం గమనార్హం. అంతేగాక, ఇది కార్పొరేట్ నిర్ణయమని.. ఉద్యోగానికి రాజీనామ చేయమని ఉద్యోగిని కోరడం సంచలనంగా మారింది. కాగా, సదరు ఉద్యోగి ఇదంతా రికార్డు చేయడం, ఆన్లైన్ పెట్టడంతో ఇప్పుడు అది వైరల్గా మారింది.
రాజీనామానా? తొలగించాలా?
6.45నిమిషాలపాటు సదరు ఉద్యోగితో.. సంస్థ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ సంభాషణ జరిపారు. మరుసటి రోజు ఉదయం 10గంటల వరకు అతని రాజీనామా లేఖను అందజేయాలని.. లేదంటే సంస్థే తొలగిస్తుందని హెచ్చరించారు. ‘ఖర్చుల నియంత్రణలో భాగంగా కొందరు ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. ఆ జాబితాలో నీ పేరు కూడా ఉంది. నీవు రాజీనామా లేఖ ఇస్తే.. సాధారణంగా సంస్థ నుంచి వెళ్లిపోయినట్లు జూన్ 15 వరకు రిలీవ్ చేస్తాం. లేదంటే సంస్థ నుంచి తొలగించేస్తాం. ఆ లేఖను మీకు పంపిస్తాం' అని హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ తేల్చి చెప్పారు.
ఎలాంటి కారణం లేకుండానే..
తాను సంస్థలో ఎంతో బాగా పని చేస్తున్నప్పటికీ ఎలాంటి కారణం లేకుండా తొలగిస్తుండటం పట్ల సదరు ఉద్యోగి.. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్తో వాదనకు దిగారు. తనను ఎందుకు తొలగిస్తున్నారో సరైన కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ‘సంస్థ నియామకం సందర్భంలోనే ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన స్పష్టమైన వివరాలు పేర్కొంది. సంస్థకు ఎప్పుడైనా ఉద్యోగులను బయటికి పంపవచ్చు' అని ఆ మహిళ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేశారు.
ఇది చాలా దురదృష్టకరం
అయినా.. కాసేపు సదరు అధికారిణితో ఉద్యోగి వాదించాడు. చివరకు ‘ఇది చాలా దురదృష్టకర చర్య.. మేడమ్' అంటూ తన సంభాషణ ముగించారు సదరు టెక్కీ. ఆ తర్వాత టెక్ మహీంద్రలో జరిగిన ఈ సంభాషణ రికార్డింగ్ను సంస్థ హెచ్ఆర్ మేనేజర్ లింక్డిన్ ప్రొఫైల్ తోపాటు వైరల్ చేశాడు సదరు ఉద్యోగి.
టెక్ మహీంద్రాలోనే..
కాగా, సంభాషణలో వచ్చిన ఇద్దరు మేనేజర్ల పేర్లను పరిశీలిస్తే అందులో ఒకరు బెంగళూరులోని టెక్ మహీంద్ర ఉద్యోగిగా తేలింది. మరొకరి జాడ మాత్రం తెలియలేదని ‘మనీకంట్రోల్' పేర్కొంది. మనీకంట్రోల్ దీనిపై టెక్ మహీంద్రాను ఈమెయిల్ ద్వారా సంప్రదించగా.. ఎలాంటి స్పందనా రాకపోవడం గమనార్హం.
ఉద్యోగి ఆవేదన
తన పేరు ఇప్పుడు ప్రకటించడం ఇష్టం లేదని చెప్పిన సదరు బాధిత టెక్ మహీంద్ర ఉద్యోగి మాట్లాడుతూ.. ఇలా ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదన్నారు. ఇప్పటి వరకు 60రోజుల గడువు ఇచ్చేవారని, ఇప్పుడు కేవలం 20రోజుల్లోనే ఉద్యోగం నుంచి తొలగించడం దారుణమన్నారు. రెండు, మూడు నెలల బేసిక్ శాలరీ ఇచ్చి విధుల నుంచి తొలగించడం సరికాదన్నారు. దీనిపై తాము ఎలాంటి న్యాయ పోరాటం చేయలేమని వాపోయాడు.
టెక్కీల్లో ఆందోళన
కాగా, ఇటీవల క్యాప్ జెమినీ సంస్థలోని ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన రికార్డు కూడా యూట్యూబ్లో సంచలనంగా మారింది. అయితే, భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు చేయడం లేదని చెప్పుకుంటు టెక్ సంస్థలు.. ఇలా పదులు సంఖ్యల్లో తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తుండటంతో టెక్కీలలో ఆందోళన కలిగిస్తోంది. కాగా, పెరుగుతున్న వ్యయాన్ని తగ్గించుకునేందుకే ప్రాజెక్టులో లేని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంస్థలు ప్రకటిస్తుండటం గమనార్హం.