నో టు ప్లాస్టిక్: ‘దోసిళ్లతో నీళ్లు తాగండి, వేపపుళ్లలతో పళ్లు తోమండి..!’
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ మీనాక్షి లేఖి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ పరిరక్షణపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. అంతేగాక, ప్లాస్టిక్ గాసులకు బదులు దోసిళ్లతో నీళ్లు తాగాలంటూ సూచించారు.
యాదాద్రి ఆలయ స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలా?: రాజా సింగ్ వార్నింగ్
చిన్నప్పుడు పాఠశాలల్లో మనం నీళ్లను దోసిళ్లతోనే తాగే వారమే కదా అని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. గ్లాసులను కడిగేందుకు నీటిని కూడా వృథా చేయాల్సిన అవసరం ఉండదని అన్నారు. అంతేగాక, ప్లాస్టిక్ బ్రష్లకు బదులు వేప కొమ్మ(పుళ్లల)లను వాడుకోవాలని అన్నారు. ఇది కూడా మన పాత అలవాటేనని ఆమె వ్యాఖ్యానించారు.
కూరగాయలు కొనేటప్పుడు కేన్ బాస్కెట్ ఉపయోగించాలని.. ప్లాస్టిక్ సంచులను కాదని ఆమె అన్నారు. అంతేగాక, పాత బట్టలను సంచులుగా కుట్టుకోవాలని, శానిటరీ ప్యాడ్స్గా మార్చుకోవాలని సూచించారు. పూర్వ కాలంలో వీటినే మనవాళ్లు వాడేవారని చెప్పుకొచ్చారు.
తాము పాలిమర్స్, ప్లాస్టిక్ని ప్రోత్సహిస్తున్నామనే ఆలోచన చేయకుండా శానిటరీ న్యాప్ కిన్లపై 18శాతం జీఎస్టీ విధించినప్పుడు మహిళలు వ్యతిరేకించారని.. తానైతే 18శాతం కాదు 28శాతం జీఎస్టీ విధించాలని చెబుతానని వ్యాఖ్యానించారు. ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్పై నిషేధం విధించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో మీనాక్షి లేఖి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.