వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు: ఆర్ఎస్ఎస్ చీఫ్
ముంబై: దేశంలో సామాజిక వివక్ష ఉన్నంతవరకు రిజర్వేషన్ల విధానం కొనసాగవలసిందేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) ఏర్పాటు చేసిన ‘స్టూడెంట్స్ పార్లమెంటు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ మేరకు స్పందించారు.
‘సామాజిక వివక్ష ఉన్నంతవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే. అయితే దాన్ని నిజాయితీగా అమలు చేయాలి' అన్నారు. ఈ దేశ రాజ్యాంగంతో ఆర్ఎస్ఎస్కు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధానాన్ని నిజాయితీగా అమలు చేయాలన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న పౌరుల విధులను కూడా పాటించాలని చెప్పారు.
కాగా, శ్రీరాముడ్ని హిందూ సంస్కృతికి ప్రతిరూపంగా భగవత్ అభివర్ణిస్తూ, అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని అభిప్రాయపడ్డారు. అయోధ్యలో రామందిరం నిర్మిస్తే దేశంలో ప్రజలకు తిండి దొరకుతుందా? అని ప్రశ్నించగా, ‘మందిరం ఇప్పటివరకు నిర్మించబడలేదు అయితే వారికి రోటీలు దొరుకుతున్నాయా?' అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
దేశంలో అసహనం పెరిగిపోతోందన్న అభిప్రాయాల గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. సహనం, స్వీకరణ అనేవి మన సంస్కృతి ముఖ్యాంశాలని అన్నారు. అంతేగాక, స్వార్థపూరిత మనోభావాలు తప్పని ఆయన అన్నారు. మత ఆధారిత రాజకీయాల గురించి ప్రశ్నించగా.. ‘ఈ ప్రశ్నను అలాంటివి చేసేవారిని అడగాలి, నన్ను కాదు' అని భగవత్ అన్నారు.
‘మనం ఏం చెప్తామో దాన్నే పాటించాలి, అలాగే మంచిని మాత్రమే స్వీకరించాలి' అని ఆయన అన్నారు. భారత రాజ్యాంగానికి సంస్కృతే మూలమని, మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమైన మార్పులు చేసుకునే వెసులుబాటు దీనికి ఉందని భగవత్ అన్నారు. ఈ కార్యక్రమంలో భగవత్ ‘సంస్కృతి, రాజ్యాంగం' అనే అంశంపై మాట్లాడారు.
దేశం స్వాతంత్య్రం పొందినప్పుడు భారతదేశం తమ దేశం కాదని భావించిన వారికోసం ఒక కొత్త దేశం ఏర్పడిందని ఆయన చెప్పారు. భారత రాజ్యాంగం అన్ని కులాలు, మతాల వారిని అంగీకరించడమే గాక ఏకాభిప్రాయంపై ఏర్పడిందైతే.. పాకిస్థాన్ రాజ్యాంగం మతం, కులం ఆధారంగా ఏర్పడిందన్నారు.
పాకిస్థాన్ మనసులో సహనం, స్వీకరణకు చోటు లేదని భగవత్ అన్నారు. భారతదేశం భిన్నత్వాన్ని స్వీకరించడమే గాకుండా గౌరవించిందని, దేశ ఐక్యతకు అదే మూలకారణమని అన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వం అనేది మన సంస్కృతి, సనాతన ధర్మం' అని మోహన్ భగవత్ చెప్పారు.