Fake : రతన్ టాటా పేరుతో సర్క్యులేషన్లో ఫేక్ న్యూస్
కరోనా వైరస్ వ్యాప్తి కంటే ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టడం పెద్ద సవాల్గా మారింది. లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా.. నిరాధారాలతో కొన్ని కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను కూడా వదల్లేదు. టాటా ఇవ్వని స్టేట్మెంట్స్ను.. ఆయన పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.
ఆ ఫేక్ న్యూస్లో ఏముందంటే.. 'కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని నిపుణులు చెబుతున్నారు. నాకీ నిపుణుల గురించి అంతగా తెలియదు. కానీ ఈ విపత్కర సమయంలో మానవ సమాజం చేస్తున్న కృషి గురించి వారికేమీ తెలియదని మాత్రం తెలుసు. ఒకవేళ నిపుణుల మాటలనే నమ్మితే.. రెండో ప్రపంచ యుద్దం తర్వాత జపాన్కు భవిష్యతే లేదు. కానీ మూడు దశాబ్దాలు గడిచేసరికి.. మార్కెట్ ట్రేడింగ్లో ఆ దేశం అమెరికాతో పోటీ పడుతోంది.'
'ఈ నిపుణుల అంచనాలే నమ్మితే.. ఈపాటికి ఇజ్రాయెల్ అరబ్ల దాడితో ప్రపంచ పటం నుంచే తుడిచిపెట్టుకుపోయేది. కానీ వాస్తవం మరోలా ఉంది. ఏరో డైనమిక్స్ రూల్స్ ప్రకారం తేనేటీగ ఎగరలేదు. కానీ అది ఎగరగలదు.. ఎందుకంటే దానికి ఏరోడైనమిక్స్ రూల్స్ తెలియదు. ఒకవేళ నిపుణుల అంచనానే నిజమైతే మనం 1983 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచేవాళ్లం కాదు.' అని రతన్ టాటా పేరుతో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. నిజానికి ఇదంతా వట్టి ఫేక్ న్యూస్. ఆయన ట్విట్టర్లోనూ ఈ సమాచారం ఎక్కడ లేదు. ఆయన చేసిన ట్వీట్లో ఈ విపత్కర సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు టాటా తరుపున తమవంతు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.