పంజాబ్లో అరుదైన ఘటన, శివాలయంలో ఖురాన్ చదివారు...!
న్యూఢిల్లీ: పంజాబ్లోని బర్నాలా జిల్లా బదౌర్లోని శివాలయంలో బుధవారం ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. శివాలయంలో ఖురాన్ చదువుతుండగా... ఆలయంలో ఉన్న సాధువులు, సిక్కు మతస్ధులు శ్రద్ధగా ఆలకించారు. గత 25 ఏళ్లుగా అక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉంది. ఇది మాత్రమే కాదు ‘గ్యారా రుదార్ శివ మందిర్' పేరుతో స్థానికులు పిలుచుకునే సదరు శివాలయంలో ఇతర మతస్థులకు ప్రత్యేకంగా ఓ హాలు కూడా ఉండటం విశేషం.
వివరాల్లోకెళితే... బదౌర్ పట్టణానికి చెందిన 20 ఏళ్ల సాకెత్ అలీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఓ హత్య కేసులో ఇరుక్కున్న అతడి తండ్రి మూడేళ్లుగా జైలులో ఉంటున్నాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుమారుడి మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత నిర్వహించాల్సిన కర్మకాండ (తొమ్మిదో రోజు ప్రార్థన)లను అతడి తల్లి సొంతంగా నిర్వహించలేని స్థితిలో ఉంది.
దీంతో తన కుమారుని కర్మకాండ గురించి శివాలయం పాలక మండలికి విన్నవించింది. శివాలయంలో సాకెత్ కర్మకాండను నిర్వహించుకునేందుకు ఆలయ కమిటీ అనుమతించింది. దీంతో బుధవారం శివాలయంలో ఖురాన్ పఠనం వినిపించింది. శివుడి బొమ్మ ఉన్న బ్యానర్ ముందు కూర్చుని ముస్లిం మత గురువు ఖురాన్ చదివి వినిపించారు.
ఇలాంటి సంఘటనలు వేరే ప్రాంతానికి చెందిన వారికి కొంత ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ బదౌర్ పట్టణ ప్రజలకు ఇది మామూలే విషయమే. 1990ల నుంచే ఈ శివాలయంలో వేరే మతాలకు చెందిన వారిని కూడా ఆహ్వానిస్తుంటారు. బదౌర్ పట్టణంలో సుమారు 250 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి జనభా 20,000 వరకూ ఉంటుంది. డిసెంబర్ నెలలో సిక్కు మతస్ధులు పది ఈవెంట్లను నిర్వహిస్తే... ముస్లింలు మూడు ఫంక్షన్స్ జరుపుకున్నారు.