దేశంలోని 8 రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆర్ ఫ్యాక్టర్, పాజిటివిటీ రేటు: కేంద్రం హెచ్చరికలు
న్యూఢిల్లీ: కరోనా ఆంక్షలను సడలించడంతో దేశంలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పోలేదని, 8 రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా వ్యాప్తిని తెలియజేసే ఆర్ ఫ్యాక్టర్(రీ ప్రొడక్షన్ రేటు) 8 రాష్ట్రాల్లో 1 కన్నా ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా పరిస్థితులపై మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో గత వారంలో పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు.
కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, అరుణాచల్ప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో గత నాలుగు వారాలుగా రోజువారీ కేసుల పెరుగుదల భారీగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. గత వారంలో నమోదైన మొత్తం కేసుల్లో 49.85 శాతం ఒక్క కేరళలోనే నమోదవడం ఆందోళనకరంగా ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ మే నెలతో పోలిస్తే జులై నెలలో రెట్టింపు సంఖ్య కన్నా అధికంగా ఉందన్నారు.
కాగా, దేశంలో డెల్టా వేరియంట్ ప్రభావంతో కేసులు పెరుగుదల కొనసాగుతోందని నీతి ఆయోగ్ ఆరోగ్యశాఖ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. సెకండ్ వేవ్లో అత్యధిక కేసులు నమోదు కావడానికి డెల్టా వేరియంట్ కారణమని తెలిసిందే. కాగా, దేశంలో రోజు రోజుకు ఆర్ ఫ్యాక్టర్ వాల్యూ పెరగడంపై వీకే పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ ఫ్యాక్టర్ 1 కంటే తక్కువగా ఉంటే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం సులభమవుతుందన్నారు. లేదంటే క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయన్నారు.
Recommended Video
కేరళతోపాటు హిమాచల్ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, పుదుచ్చేరిలో ఆర్ ఫ్యాక్టర్ 1 కన్నా ఎక్కువగా ఉందన్నారు. ఏపీ, మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోందని వీకే పాల్ తెలిపారు. పశ్చిమబెంగాల్, నాగాలాండ్, హర్యానా, గోవా, ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1గా ఉందన్నారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఆర్ వాల్యూ 1 కన్నా ఎక్కువగా ఉంటే.. కేసుల సంఖ్య పెరుగుతోందని, వెంటనే అప్రమత్తమై కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వాలకు సూచించారు.