ఏపీ సహా: ఆ అయిదు రాష్ట్రాల్లో తగ్గుతోన్న రీప్రొడక్టివ్ వేల్యూ: శుభసూచకం అంటోన్న ఐఎంఎస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహా భయానకంగా విస్తరిస్తోన్న వేళ.. శుభ సంకేతాలు వెలువడుతున్నాయి. అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతోన్న అయిదు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రీప్రొడక్టివ్ వేల్యూ తగ్గుముఖం పట్టింది. ఆర్-వేల్యూ ఒకటి కంటే దిగువకు చేరుకుందని తేలింది. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందనడానికి ఇది ఆశించిన సంకేతాలు ఇస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ఇన్స్టిట్యూట్ ఆప్ మేథమేటిక్స్ సైన్సెస్ (ఐఎంఎస్) ఓ నివేదికను రూపొందించింది.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజూ 80 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఇందులో అయిదు రాష్ట్రాల వాటా అత్యధికంగా ఉంటోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధప్రదేశ్, ఉత్తరప్రదేశ్లల్లో పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో రికార్డవుతున్నాయి. కొద్దిరోజులుగా వాటి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆయా రాష్ట్రాలు విడుదల చేస్తోన్న రోజువారీ బులెటిన్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం ఒక సానుకూల సంకేతాన్ని ఇస్తోంటే.. దాని రీప్రొడక్టివ్ వేల్యూ తగ్గడం మరింత ఊరట కలిగిస్తోందని ఐఎంఎస్ రీసెర్చర్ సితభ్ర సిన్హా తెలిపారు. ఈ నెల 19వ తేదీ తరువాత ఆర్-వేల్యూ తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. దాని వేల్యూ ఒకటి కంటే దిగువకు చేరిందని, 0.9 శాతంగా నమోదవుతోందని పేర్కొన్నారు. 19వ తేదీ తరువాత మహారాష్ట్ర, కర్ణాటకల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించినట్లు తమ అధ్యయనంలో పొందుపరిచామని చెప్పారు.
కరోనా వైరస్ పరిస్థితులు మున్ముందు ఎలాంటి ఉంటాయనే విషయం ముంబై, పుణె, చెన్నై, కోల్కత, బెంగళూరు వంటి మహా నగరాల్లో నమోదవుతోన్న కేసులపై ఆధారపడి ఉంటుందని అంచనా వేసినట్లు సితభ్ర సిన్హా అన్నారు. మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటోందని, దాని ఆధారంగా రీప్రొడక్టివ్ వేల్యూను లెక్కలోకి తీసుకుంటే.. హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని అన్నారు.
Recommended Video
ఇదివరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతల్లో రీప్రొడక్టివ్ వేల్యూ ఒకటి కంటే తగ్గినప్పటికీ.. మళ్లీ స్వల్పంగా పెరుగుదల బాట పట్టినట్లు చెప్పారు. ఓవరాల్గా రీప్రొడక్టివ్ వేల్యూ ఒకటికి చేరుకోవట్లేదని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగితే.. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కొద్దిగానైనా నియంత్రణలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని తాము అభిప్రాయపడుతున్నట్లు ఐఎంఎస్ నిపుణులు స్పష్టం చేశారు.