'రబ్రీదేవి వల్లే ఆరెస్సెస్ డ్రెస్ కోడ్ మార్చుకుంది'
పాట్నా: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) డ్రెస్ కోడ్ మార్పుపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ డ్రెస్ కోడ్ మార్చుకోవడం తన భార్య ఘనతేనని ఆయన ట్వీట్ చేశారు.
తన భార్య రబ్రీదేవీ ఆరెస్సెస్ డ్రెస్ మార్చుకునేలా చేయగలిగారని ఆయన పేర్కొన్నారు. వారిని ప్యాంట్ల నుంచి మళ్లీ నెక్కర్లలోకి మారుస్తామంటూ ఆరెస్సెస్ పై విమర్శలు చేశారు.
దాదాపు రెండు నెలల క్రితం ఆరెస్సెస్ డ్రెస్ కోడ్ను తన భార్య తప్పుబట్టిందని, దీంతో ఇబ్బందిగా భావించిన ఆరెస్సెస్ నాయకత్వం నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశ పెట్టిందని లాలూ ప్రసాద్ అన్నారు. నిక్కర్లు వేసుకొని బహిరంగంగా తిరగడానికి ఆరెస్సెస్ వృద్ధ నేతలు సిగ్గుపడటం లేదా అని గత జనవరిలో రబ్రీదేవి ప్రశ్నించారు.
ఆమె వ్యాఖ్యలను బీహార్ బిజెపి నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రబ్రీదేవి 19వ శతాబ్దం నాటి పాతకాలపు మహిళలా మాట్లాడుతున్నారని బిజెపి బీహార్ చీఫ్ సుశీల్ మోడీ విమర్శించారు. కాగా, గత ఆదివారం నుండి డ్రెస్ కోడ్ మారుస్తున్నట్లు ఆరెస్సెస్ ప్రకటించింది.
సంపన్న వర్గాలకు రిజర్వేషన్ తగదు: ఆరెస్సెస్
రిజర్వేషన్ల కోసం సంపన్న వర్గాలు చేస్తున్న డిమాండ్ను సమ్మతించకూడదని ఆరెస్సెస్ ఆదివారం స్పష్టం చేసింది. రిజర్వేషన్లు అవసరమైన వెనకబడిన తరగతుల వారు నిజంగా వాటి ద్వారా లబ్ధిపొందుతున్నారో లేదో తెలుసుకోవడానికి సమగ్ర పరిశీలన జరపాలని కోరింది.
కులాల మధ్య తారతమ్యాలకు హిందూ సమాజంలోని వారే కారణమని అన్నారు. సామాజిక న్యాయం తీసుకురావడానికి వీటిని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి అనుసరిస్తున్న ఖాకీ నిక్కరు స్థానంలో గోధుమ రంగు పూర్తి ప్యాంటును వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.