ఐఆర్సీటీసీ స్కాం: లాలూ భార్య రబ్రీదేవి, తేజస్వి యాదవ్కు బెయిల్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవికి, వారి కుమారుడు తేజస్వి యాదవ్కు ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో బెయిల్ లభించింది. ఢిల్లీ కోర్టు శనివారం వీరిద్దరికి సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
ఐఆర్సీటీసీ కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా నిందితుడిగా ఉన్నారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో విచారణ నిమిత్తం లాలూ ప్రసాద్ను నవంబరు 19న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.
ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని, హోటళ్ల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలతో సీబీఐ వీరిపై కేసులు నమోదు చేసింది. ఐఆర్సీటీసీలో ఈ అక్రమాలు 2006 జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
శనివారం ఉదయం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన విచారణకు రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ హాజరయ్యారు. ఈ కేసులో లాలూ, రబ్రీ దేవి, తేజస్వితో పాటు ఆర్జేడీ నేత పీ.సీ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, మరికొందరు నిందితులుగా ఉన్నారు. వీరిపై ఏప్రిల్ 16న సీబీఐ ఛార్జీ షీటు నమోదు చేసింది. లాలూ, రబ్రీ, తేజస్వి, ఇతర నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని తెలిపింది.