సాధ్వీని సాగనంపాలన్న నితీశ్.. బీజేపీతో తెగదెంపులు చేసుకొమ్మని రబ్రీ సవాల్..
పాట్నా : గాడ్సే దేశభక్తుండంటూ సాధ్వీ ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కామెంట్లపై బీహార్లో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ ఊహించని షాక్ ఇచ్చింది. భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు.
పాట్నాలో ఓటువేసిన అనంతరం ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు నితీశ్ కుమార్ ఈ సమాధానం ఇచ్చారు. సాధ్వీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన.. అలాంటి కామెంట్లకు తమ మద్దతు ఎప్పుడూ ఉండదని స్పష్టం చేశారు. అయితే ఈ అంశం బీజేపీ అంతర్గత వ్యవహారమైనందున సాధ్విపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీకే ఉందని అభిప్రాయపడ్డారు.
కొట్టి.. కేసు పెట్టి.. ఫొటోగ్రాఫర్పై తేజ్ ప్రతాప్ బౌన్సర్ల ప్రతాపం..
సాధ్వీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న బీహార్ సీఎం వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఆర్జేడీ నేత రబ్రీదేవి ఫైర్ అయ్యారు. గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వీ చేసిన వ్యాఖ్యలు ఆయనను నిజంగా బాధించి ఉంటే వెంటనే బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రబ్రీ సాధ్వీ మాటలు అంతగా బాధించి ఉంటే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోని పార్టీతో కలిసి ఎందుకు పని చేస్తున్నారని రబ్రీ ప్రశ్నించారు. నితీశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.