సోనియాపై వ్యాఖ్యలు: మోడీ వద్ద గిరిరాజ్ సింగ్ ఏడ్చేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ను ప్రధాని నరేంద్ర మోడీ చీవాట్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ సమయంలో గిరిరాజ్ సింగ్ మోడీ వద్ద ఏడ్చేసినట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందులో నిజమేమిటో తెలియదు గానీ ఆ వార్తలను గిరిరాజ్ సింగ్ కొట్టిపారేశారు.
తాను మోడీని కలవనే లేదని, తాను ఏడ్చినట్లు ఎవరు చెప్పారు, ఎవరు చూశారని గిరిరాజ్ సింగ్ మంగళవారం అన్నారు. తెల్ల తోలు మహిళ కాకపోతే కాంగ్రెసు పార్టీ సోనియా గాంధీని కాంగ్రెసు నాయకులు అధ్యక్షురాలిగా అంగీకరించేవారా అని గిరిరాజ్ సింగ్ అప్పట్లో అన్నారు. దీంతో తీవ్ర వివాదం చెలరేగింది.
గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై సోమవారం పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెసు సభ్యులు గిరిరాజ్ సింగ్పై మండిపడ్డారు. దీంతో ఆయన క్షమాపణ చెప్పక తప్పలేదు.
లోకసభ సోమవారంనాడు సమావేశం కాగానే, కాంగ్రెసు పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆ విషయాన్ని లేవనెత్తారు. బిజెపి పార్లమెంటు సభ్యులు, మంత్రులు వరుసగా అవాంఛనీయమైన, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అటువంటి వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రేపుతాయని ఆయన అన్నారు.