విమానంలో త్రిశూలం: రాధే మాకు కొత్త కష్టాలు
ముంబై: వివాదస్పద ఆధ్యాత్మిక గురువు (గాడ్ వూమెన్) రాధే మాకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. త్రిశూలం చేత పట్టుకుని విమానంలో ప్రయాణించారని ఓ సామాజిక కార్యకర్త ( ఆర్ టీఐ కార్యకర్త) దాఖలు చేసిన ఫిటీషన్ లో బాంబే హై కోర్టు స్పందించడంతో ఆమె వివాదంలో చిక్కుకున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో రాధే మా ఔరంగాబాద్ నుంచి ముంబైకి ఓ ప్రయివేటు విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో రాధే మా త్రిశూలం చేతపట్టుకున్నారు. ఈ విషయం పై సామాజిక కార్యకర్త రమేష్ జోషి బాంబే హై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
మారణాయుధం లాంటి త్రిశూలాన్ని విమానంలో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ చర్య ద్వారా సివిల్ యావియేషన్ నిబంధనలను రాధే మా అతిక్రమించారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. న్యాయస్థానం పిటీషన్ విచారణకు స్వీకరించింది.
పిటీషన్ విచారణ చేసిన జస్టిస్ వి.ఎం. కనాడే, షాలిన్ ఫానల్కార్ లతో కూడిన బెంచ్ నవంబర్ 18 లోపు అఫిడవిట్ దాఖలు చెయ్యాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే పీలకదాక కష్టాల్లో ఉన్న రాధే మాకు కొత్త చిక్కు వచ్చిపడింది.