'రజనీ, జయ ఇక్కడివాళ్లు కాదు.. వాళ్లనెందుకు ఆదరించాలి?'
కర్ణాటక నుంచి వచ్చిన రజనీకాంత్, ఇక్కడ రాజ్యమేలుతున్నారని రాధికా విమర్శించారు.
చెన్నై: ఓవైపు హీట్ పుట్టిస్తోన్న శశికళ-దీప పొలిటికల్ ఫైట్.. మరోవైపు రజనీ-శరత్ కుమార్ వివాదంతో తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వాడి-వేడి చర్చలు.. రోడ్లపై రజనీ అభిమానుల ఆగ్రహావేశాలతో.. ఏ నోట విన్నా వీటి గురించే చర్చ.
రజనీకాంత్ పైన షాకింగ్ వ్యాఖ్యలు
రజనీ రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటానని శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై రజనీ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రోడ్డెక్కి ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దిష్టిబొమ్మలు కూడా దగ్దం చేయడంతో.. ఈ వివాదం మరింత ముదరుతున్నట్టుగా కనిపిస్తోంది.
రజనీపై కామెంట్స్ చేసి వివాదాన్ని కొని తెచ్చుకున్న శరత్ కుమార్.. అభిమానుల ఆగ్రహంతో కాస్తంత వెనక్కి తగ్గినట్టే కనిపించారు. తాను రజనీని విమర్శించలేదని, తమిళులు మాత్రమే పాలనా బాధ్యతలు చేపట్టాలని అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
శరత్ కుమార్ వ్యాఖ్యలకు జతకలిసిన రాధిక:
రజనీపై శరత్ కుమార్ వ్యాఖ్యలను సమర్థించేలా నటి రాధిక స్పందించారు. వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా ఆమె వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో స్థానికేతరులే రాజ్యమేలుతున్నారని, వారిని నిలువరించాలని రాధిక సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంజీఆర్, జయలలిత, రజనీకాంత్, వైగో, విజయ్ కాంత్ తదితరులంతా స్థానికేతరులేనని రాధిక విమర్శించారు. వీళ్లను ఆదరించాల్సిన అవసరం తమిళులకేంటని ప్రశ్నించారు. కర్ణాటక నుంచి వచ్చిన రజనీకాంత్, ఇక్కడ రాజ్యమేలుతున్నారని విమర్శించారు. రజనీపై శరత్ కుమార్ వ్యాఖ్యలతో రాధిక మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదస్పద కామెంట్స్ చేశారు.
అలా అయితే ప్రత్యర్థినే: రజనీపై వెనక్కి తగ్గిన శరత్
ఇదే మీడియా సమావేశంలో విశాల్ గురించి కూడా రాధిక ప్రస్తావించారు. విశాల్ రెడ్డి కులస్తుడని, ఆంధ్రా నుంచి వచ్చాడని చెప్పుకొస్తూ.. విశాల్ ఎవరు?, విశాల్ రెడ్డి. కార్తీ, శివరామ్ వీళ్లంతా ఎవరు? తమిళులా? వీరందరిని వెనుక నుంచి మరెవరో నడిపిస్తున్నారు.. అంటూ రాధిక వివాదస్పద రీతిలో స్పందించారు.
ఆఖరికి దివంగత సీఎం జయలలితపై కూడా రాధిక విమర్శలు గుప్పించారు. జయలలిత కూడా పుట్టుకతో తమిళురాలు కాదన్నారు.