సత్తా లేదు: విజయకాంత్పై రాధిక సంచలన వ్యాఖ్యలు
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, ప్రజాసంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి విజయకాంత్కు ముఖ్యమంత్రి అయ్యే సత్తా లేదని సమత్వ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) మహిళా విభాగ అధ్యక్షురాలు, సినీ నటి రాధికా శరత్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే కూటమిలోని శరత్ కుమార్ పార్టీకి తిరుచెందూర్ నియోజకవర్గం కేటాయించిన విషయం తెలిసిందే.
కాగా, ఇక్కడి నుంచే ఎస్ఎంకె అధ్యక్షుడు శరత్కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ తరపున రాధిక ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీఎంకే కుటుంబ రాజకీయాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఆ పార్టీకి ప్రజలు ఓట్లెయ్యరని.. ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు.
కెప్టెన్ విజయకాంత్కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదన్నారు. తాను ఆయనతో పలు సినిమాల్లో నటించానని, అందువల్లే ఆయన సత్తా ఏంటో తనకు తెలుసని పేర్కొన్నారు.
విజయకాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకే తెలియడం లేదని ఆరోపించారు. అలాంటప్పుడు ప్రజలు ఆయన్ను ఎలా అర్థం చేసుకోగలరని రాధిక ప్రశ్నించారు.
అంతేగాక, ముఖ్యమంత్రి జయలలితపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల కోసమే జీవితాన్ని అర్పించిన మహిళ జయలలిత అని కొనియాడారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆమెకు సాటి ఎవరూ లేరని అన్నారు.
తల్లి గుణం కలిగిన ఆమె రాష్ట్ర ప్రజల కోసం, వారికి అవసరమైన పరిపాలన సాగిస్తారని చెప్పారు. ఐదేళ్లలో పలు మంచి పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అవే తన భర్త శరత్కుమార్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.