ఇన్కంట్యాక్స్లో భారీ మార్పులు ...కొత్త శ్లాబులు ఇలా ఉండే ఛాన్స్
న్యూఢిల్లీ: ఏడాదికి మీ ఆదాయం రూ. 5లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉన్నట్లయితే 10శాతం వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవెల్ ట్యాక్స్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రత్యక్ష్య పన్నుల విషయంలో పెను మార్పులు సూచించినట్లు సమాచారం. ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు ఆదాయం ఉన్నవారికి వ్యక్తిగత ఆదాయపు పన్ను 20శాతం తగ్గించాలనే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
ఐదు విభాగాలుగా ట్యాక్స్ శ్లాబులు
ప్రస్తుతం ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం ఉన్నవారికి 5శాతం పన్ను విధించడం జరుగుతోంది.ఇక రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆదాయం ఉన్నవారికి 20శాతం పన్ను, అలాగే రూ.10 లక్షలు పైగా ఆదాయం ఉన్నవారికి 30శాతం ఇన్కమ్ ట్యాక్స్ విధించడం జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ ఐదు విభాగాలుగా ట్యాక్స్ శ్లాబులను విభజించినట్లు సమాచారం. 5 శాతం, 10శాతం, 20 శాతం, 30 శాతం, 35శాతం శ్లాబులు క్రియేట్ చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
కేంద్రంకు సమర్పించిన నివేదిక
ఏడాదికి రూ.5 లక్షలు సంపాదన ఉన్నవారు, తాము కట్టే పన్నులో రిబేట్ ఉంటుందని, ఇదే విషయాన్ని 2019 మధ్యంతర బడ్జెట్లో అప్పటి కేంద్ర ఆర్థికశాఖమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అంటే రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను కట్టక్కర్లేదనేది దీనర్థం. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ సభ్యుడు అఖిలేష్ రంజన్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆగష్టు 19న అఖిలేష్ రంజన్ కమిటీ తమ ప్రతిపాదనను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు సమర్పించింది.
కొత్తగా 35శాతం శ్లాబును సూచించిన కమిటీ
కమిటీ సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ఏడాదికి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్లు ఆదాయం కలిగి ఉన్నవారు పాత పద్ధతి ప్రకారమే 30శాతం పన్ను కట్టాలని సూచించినట్లు సమాచారం.అంతేకాదు ఈసారి కొత్తగా 35శాతం శ్లాబును తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.2 కోట్లకు పైగా సంపాదించేవారు 35శాతం పన్ను కట్టాలని రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త విధానాలతో ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయడమే కాకుండా మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించేలా ఉన్నాయి. 58 ఏళ్ల క్రితం నాటి ఆదాయపు పన్ను చట్టంకు సవరణలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్యానెల్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్యానెల్ ప్రతిపాదించిన వాటిలో డివిడెండ్ను పంచాలన్న పద్దతికి స్వస్తి పలకడం, కనీస ప్రత్యామ్నాయ పన్నుకు చెక్ పెట్టడం లాంటివి ఉన్నాయి.