మురికి కాల్వలోకి దూసుకెళ్లిన కారు, రేడియో మిర్చి ఆర్జే తానియా మృతి
న్యూఢిల్లీ: ఘజియాబాద్కు చెందిన 26 ఏళ్ల జాకీ తానియా ఖన్నా బుధవారం వేకువజామున మృతి చెందింది. నోయిడాలో ఆమె ప్రయాణిస్తున్న కారు మురికి కాలువలోకి చొచ్చుకు వెళ్లింది. ప్రమాదం కారణంగా ఆమె మృతి చెందింది.
తానియా ఖన్నా రేడియో మిర్చీలో ఆర్జేగా పని చేస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు ఆమె ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తూ, అదుపు తప్పి నోయిడాలోని సెక్టార్ 94 సమీపంలోని ఓ మురికి కాలువలో పడింది.
ఆమె కారు మురికి గుంతలో పడటాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.స్థానికులు చెప్పిన సమాచారం మేరకు ఆమె వాహనం అర్ధరాత్రి రెండు గంటలకు ప్రమాదానికి గురయింది.
ఆమె కారును క్రేన్ సహాయంతో డ్రెయిన్ నుంచి తీశారు. ఆమెను కారులో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.