పాఠశాలలో దారుణం: మహిళా టీచర్పై కుర్చీలతో విద్యార్థుల దాడి(వీడియో)
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలి గాంధీ సేవా నికేతన్ పాఠశాలలో విద్యార్థులు రౌడిల్లా ప్రవర్తించారు. ఏకంగా ఉపాధ్యాయురాలిపైనే కుర్చీలతో దాడి చేశారు. అయితే, కొందరు విద్యార్థులు అడ్డుకుని ఆమెను బయటికి పంపేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి బుర్కా, ఉత్తరప్రదేశ్ లో అరాచకం, కాంగ్రెస్ ఆందోళన!
టీచర్ బ్యాగును విసిరేసి..
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠం చెబుతున్న సమయంలో ఓ విద్యార్థి లేచి ఆమెను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత మరో విద్యార్థి ఆమె బ్యాగును విసిరేసి పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయురాలు సదరు విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
కుర్చీలతో దాడి..
ఈ క్రమంలో ఓ విద్యార్థి అక్కడున్న కుర్చితో సదరు మహిళా ఉపాధ్యాయురాలిపై దాడి చేశాడు. పలుమార్లు ఆమెపైకి దూసుకెళ్లి కుర్చితో కొట్టాడు. కాగా, పాఠశాల మేనేజర్ తనతో గొడవపడి తనను విధుల నుంచి తొలగించాడని, అయితే, మాజీ జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ జోక్యం చేసుకుని మళ్లీ తనను ఉద్యోగంలో చేరేలా చేశారని బాధిత ఉపాధ్యాయులు మమతా దూబే తెలిపారు.
వేధింపులు... మేనేజర్ హస్తం..
కాగా, నేహా శర్మ ఇక్కడ్నుంచి బదిలీ కావడంతో సదరు మేనేజర్ మళ్లీ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, ఈ దాడి వెనుక కూడా అతని హస్తం ఉందని మమత ఆరోపించారు. ఇంతకుముందు తనను విద్యార్థులు వాష్ రూంలో బంధించారని అధికారులకు ఫిర్యాదు చేస్తే.. విద్యార్థులు తమకు ఇష్టం వచ్చినట్లు ఉంటారని.. వారు ఏదనుకుంటే అదే చేస్తారని అధికారులు చెప్పారని వాపోయారు. తనపై దాడి ఘటనపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని మమత దూబే తెలిపారు.