భద్రతా దళాల గుప్పిట్లో: కొవ్వొత్తులు వెలిగించి.. స్వాగతం: ఇళ్ల మీద నిల్చుంటే కఠిన చర్యలు
చండీగఢ్: భారత రక్షణశాఖ అమ్ములపొదిలో చేరబోతోన్న బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న రాఫెల్ యుద్ధ విమానాలు వస్తోన్న వేళ.. హర్యానా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండ్ కాబోయే వైమానిక దళానికి చెందిన ఎయిర్బేస్ ఉన్న అంబాలాలో 144 సెక్షన్ను విధించింది. ఎయిర్బేస్కు ఆనుకుని ఉన్న నాలుగు గ్రామాలతో పాటు ఆ పరిధి మొత్తాన్ని 144 సెక్షన్లోకి పరిధిలోకి వస్తుందని హర్యానా పోలీసులు వెల్లడించారు. రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యే దృశ్యాలను ఫొటోలు తీయడం, వీడియోల్లో చిత్రీకరించడాన్ని నిషేధించారు.
శతృదేశాల గుండెల్లో రాఫెల్: యుద్ధ విమానాల శక్తి సామర్థ్యాలు ఇవే.. ధర ఎంతో తెలుసా?
హర్యానా ప్రభుత్వం కట్టుదిట్ట ఏర్పాట్లు..
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు కాస్సేపట్లో భారత్కు చేరుకోనున్నాయి. ఈ మధ్యాహ్నానికి హర్యానాలోని అంబాలాలో గల భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్బేస్ స్టేషన్లో ల్యాండ్ కాబోతున్నాయి. ఈ జెట్ ఫైటర్స్ను వైమానిక దళాధినేత రాకేష్ కుమార్ భడౌరియా సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను హర్యానా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. హర్యానా హోం శాఖ మంత్రి అనిల్ విజ్ ఇప్పటికే పలుమార్లు సమీక్షలను నిర్వహించారు.
నాలుగు గ్రామాల్లో 144 సెక్షన్..
మంగళవారం ఉదయం నుంచి 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం విధించారు. అంబాలా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందీ ఎయిర్బేస్ స్టేషన్. దీనికి ఆనుకుని నాలుగు గ్రామాలు ఉన్నాయి. ధూల్కోట్, బల్దేవ్ నగర్, గర్నాలా, పంజ్ఖోరా గ్రామాల్లో 144 సెక్షన్ను విధించారు. రాఫెల్ యుద్ధ విమానాలు ఎయిర్బేస్లో ల్యాండ్ అయ్యే సమయంలో ఎవరూ గానీ తమ ఇళ్ల మీద నిల్చోకూడదని జిల్లా కలెక్టర్ అశోక్ శర్మ ఆదేశాలను జారీ చేశారు. అలా ఏ ఒక్కరు నిల్చున్నా కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.
అనిల్ విజ్ సొంత నియోజకవర్గం కావడంతో..
తమ సెల్ ఫోన్ల ద్వారా గానీ, ఎలాంటి ఇతర కెమెరాలతో గానీ రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యే దృశ్యాలను చిత్రీకరించడం గానీ, ఫొటోలను తీయడం గానీ చేయకూడదని కలెక్టర్ ఆదేశించారు. హర్యానా హోం శాఖ మంత్రి అనిల్ విజ్ సొంత నియోజకవర్గం కావడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆరు సార్లు అంబాలా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అనిల్ విజ్.. రాఫెల్ యుద్ధ విమానాల రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. పలుమార్లు కలెక్టర్, ఎస్పీలతో సమీక్షలను నిర్వహించారు.
Recommended Video
కొవ్వుత్తులు వెలిగించి..
అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలాకు రాబోతోన్న సందర్భంగా స్థానిక ప్రజలు వినూత్నంగా వాటికి స్వాగతం పలకబోతున్నారు. ఈ సాయంత్రం 7 నుంచి 7:30 గంటల మధ్య ప్రతి ఒక్కరు కొవ్వొత్తులను వెలగించి, వాటికి స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు అంబాలా సిటీ శాసనసభ్యుడు అసీమ్ గోయెల్ ఏర్పాట్లు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అంబాలా ప్రజలు ప్రతి ఒక్కరూ కొవ్వొత్తులను వెలిగించి రాఫెల్ యుద్ధ విమానాలకు స్వాగతం పలకాలని గోయెల్ విజ్ఙప్తి చేశారు.