రాఫెల్ డీల్: కాగ్ డీజీ తప్పుకోవాల్సిందే..స్వచ్ఛందంగా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతిని దృష్టిలో ఉంచుకుని.. కంప్టోులర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి విచారణ నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్రమాజీ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. రాఫెల్ ఒప్పందాలపై కాగ్ ఇచ్చే నివేదిక పక్షపాత రహితంగా ఉండటానికి రాజీవ్ మహర్షి తనకు తానుగా తప్పుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాఫెల్ ఒప్పందాలపై కాగ్.. మరి కొన్ని గంటల్లో తన నివేదికను పార్లమెంట్ కు సమర్పిస్తుంది.
ఇలాంటి సమయంలో.. రాజీవ్ మహర్షి ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందని, కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారని కపిల్ సిబల్ అభిప్రాయ పడ్డారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలను కేంద్రం కుదుర్చుకునే సమయంలో రాజీవ్ మహర్షి ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశారని సిబల్ గుర్తు చేశారు. 2015 ఏప్రిల్ లో కేంద్రం 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 58 వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు.
అదే ఏడాది 126 ఎంఎంఆర్సీఏ ఎయిర్ క్రాఫ్ట్ ల ఒప్పందాన్ని ఆర్థికశాఖ రద్దు చేసిందని, ఇవన్నీ రాజీవ్ మహర్షి హయాంలోనే చోటు చేసుకున్నాయని చెప్పారు. ఈ రెండు అంశాల్లో కూడా రాజీవ్ మహర్షికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని, దీనివల్ల కాగ్ డైరెక్టర్ జనరల్ గా ఆయన కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారని అన్నారు. ఆయన హయాంలోనే రాఫెల్ ఒప్పందాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అత్యున్నత స్థాయిలో భారీ అవినీతి చోటు చేసుకుందని, ఇది రాజీవ్ మహర్షి ప్రత్యక్ష ప్రమేయం ఉందని తాము అనుమానిస్తున్నట్లు కపిల్ సిబల్ తెలిపారు.
ఇలాంటి సందర్భంలో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంలో ఆడిట్ ను నిర్వహించడానికి ఆయనేమీ న్యాయమూర్తో లేదా ఆడిటరో కాదని అన్నారు. ఎవ్వరూ కూడా తమ సొంత లాభం కోసం తీర్పులు ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు. రక్షణ శాఖ కొనుగోళ్ల నిబంధనలు గానీ, కేంద్ర ఆర్థికశాఖ గానీ, రక్షణ వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గానీ.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదని సిబల్ అన్నారు. దీన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి పంపించాలని చెప్పారు.