రాఫేల్ కేసులో తీర్పు: రివ్యూ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..రాహుల్కు ఊరట
Recommended Video
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా పలు కీలక కేసుల్లో తీర్పు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అయోధ్య భూవివాదం, శబరిమల కేసు, రాఫెల్ కేసుల్లో దాఖలైన రివ్యూ పిటిషన్పై తీర్పు ఇచ్చారు. ముందుగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్ను పెద్ద బెంచ్కు బదిలీ చేస్తున్నట్లు చెప్పిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్... ఆ వెంటనే రాఫెల్ విషయంలో దాఖలైన రివ్యూ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు చెప్పారు. ఇక రాఫెల్ విషయంలో దాఖలైన అన్ని పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.
సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్
రాఫెల్ విషయంలో అవినీతి జరిగిందని న్యాయవిచార జరపాలంటూ గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. దీన్ని విచారణ చేసిన సర్వోన్నత న్యాయస్థానం మోడీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తీర్పును పునఃసమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేసిన అత్యున్నత ధర్మాసనం రివ్యూ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒక ఒప్పందం
రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టు... రాఫెల్ యుద్ధ విమానకొనుగోలు ఒక ఒప్పందం అనే సంగతి విస్మరించరాదని వెల్లడించింది. రాఫెల్ విషయంలో ఎఫ్ఐఆర్కు ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ ఎస్కే కౌల్ తీర్పు సందర్భంగా చదివారు. అదే సమయంలో విచారణకు ఆదేశించేంతగా కోర్టుకు ఏమీ కనిపించడం లేదని వెల్లడించారు.
రాహుల్ నోరు జారకు
అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ చౌకీదార్ చోర్హే అన్న వ్యాఖ్యలను కోర్టుకు ఆపాదిస్తూ కోర్టు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి వేసిన ధిక్కార పిటిషన్కు సుప్రీంకోర్టు ముగింపు పలికింది. ఇక రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం భవిష్యత్తులో నోరు జారరాదని వెల్లడించింది. గతంలో న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పాలని కోర్టు కోరగా.... అందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పారు. రాహుల్ క్షమాపణ చెప్పినందున కోర్టు అంగీకరిస్తోందని పేర్కొంది.
కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి
రాఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ గత ఏడాది డిసెంబర్ 14న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. అప్పట్లో రాఫెల్లో అవకతవకలు జరిగాయంటూ ఓ జాతీయ దినపత్రిక డాక్యుమెంట్స్తో సహా కథనాన్ని ప్రచురించింది. దొంగిలించిన పత్రాల ఆధారంగా పిటిషన్ను దాఖలు చేశారని మార్చి 6 న జరిగిన విచారణలో ఏజీ ఆరోపించారు. రెండు రోజుల తర్వాత ఆయన తన వాదనను సవరించుకున్నారు. రాఫేల్ పత్రాలు దొంగతనానికి గురికాలేదని, అసలు పత్రాలకు సంబంధించిన ఫొటోకాపీలను జత చేశారని తెలిపారు. ఆ సమయంలో రక్షణ శాఖ ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు దేశ భద్రతకు సంబంధించిన విషయమని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు కాగా కేసులో వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆ రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించింది సర్వోన్నత న్యాయస్థానం.