భారత గగనతలంలో రాఫేల్ ఫైటర్ జెట్లు... అంబాలాకు ఎస్కార్ట్ చేసిన సుఖోయ్ యుద్ధ విమానాలు
అంబాలా: భారత్ చైనా వివాదం నేపథ్యంలో భారత్కు అందుబాటులోకి రానున్న ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు యూఏఈ నుంచి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. జూలై 27వ తేదీన ఫ్రాన్స్లోని డస్సాల్ట్ ఏవియేషన్కు చెందిన ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న రాఫేల్ యుద్ధ విమానలు 3200 కిలోమీటర్లు ప్రయాణం చేసి యూఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్కు చేరుకున్నాయి. అనంతరం బుధవారం ఉదయం 11:30 గంటలకు బయలుదేరిన ఈ యుద్ధవిమానాలు భారత గగన తలంలోకి ప్రవేశించాయి.
భారత గగనతలంలోకి ప్రవేశించగానే ఐఎన్ఎస్ యుద్ధ నౌక నుంచి స్వాగతం పలుకుతూ రేడియో మెసేజ్ వెళ్లింది. ఇందుకు రాఫేల్ జెట్ కమాండర్ కూడా ధన్యవాదాలు చెబుతూ సమాధానం ఇచ్చారు. ఈ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించగానే వీటికి రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు స్వాగతం పలికాయి. అనంతరం ఐదు ఫైటర్ జెట్లతో పాటు ఈ రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా అంబాలా ఎయిర్బేస్ వైపు కదిలాయి.
ఇక గగనతలంలో ఐదు ఫైటర్ జెట్లకు స్వాగతం పలికిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానాలకు సంబంధించిన వీడియోను ట్విటర్ ద్వారా రక్షణ శాఖ కార్యాలయం విడుదల చేసింది. అంబాలాలో ఈ యుద్ధ విమానాలకు ఐఏఎఫ్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా స్వాగతం పలుకుతారు. అనంతరం వీటికి వాటర్ సెల్యూట్ ఇస్తారు. భారీ మొత్తం వెచ్చించి భారత్ ఈ అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. మొత్తం రూ.59వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
The five Rafales escorted by 02 SU30 MKIs as they enter the Indian air space.@IAF_MCC pic.twitter.com/djpt16OqVd
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) July 29, 2020
Recommended Video
ఇక ల్యాండింగ్ సందర్భంగా ఎలాంటి అడ్డంకులు కలగకుండా వైమానిక అధికారులు చర్యలు తీసుకున్నారు. రన్వేపై పక్షులు లేకుండా అధికారులు చెదరగొడుతున్నారు.