4 వారాలెందుకు.. 4రోజులు చాలదా..! రఫేల్ రివ్యూ పిటిషన్లపై కేంద్రానికి సుప్రీం ఝలక్
ఢిల్లీ : రఫేల్ కేసులో కేంద్రానికి చురకలంటించింది సుప్రీంకోర్టు. రఫేల్ తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై 4 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. వాటిపై స్పందించడానికి కేంద్రం 4 వారాల గడువు కోరగా.. సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. మే 4వ తేదీ శనివారంలోగా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.
ఆశ్రమంలో అత్యాచారం..! ఆశారాం బాపు కుమారుడికి జీవిత ఖైదు
రఫేల్ ఒప్పందం విషయంలో కొన్ని కీలక పత్రాలు బహిర్గతం కావడం ద్వారా పిటిషనర్లు మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ డాక్యుమెంట్ల ప్రాతిపదికన సమీక్ష జరపాలని కోర్టుకు విన్నవించారు. అయితే అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని రక్షణ శాఖ నుంచి దొంగిలించి జిరాక్స్ పత్రాలను కోర్టుకు సమర్పించారని వాదించింది. అలా అడ్డదారిలో సంపాదించిన డాక్యుమెంట్లతో తీర్పును సమీక్షించడం సరికాదని తెలిపింది. అయితే అటు పిటిషనర్లు, ఇటు కేంద్రం వాదనలు విన్న ధర్మాసనం కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చింది.
మొత్తంగా లీకైన పత్రాలైనప్పటికీ ఏమీ కాదని చెబుతూనే పునఃసమీక్ష జరిపేందుకు అంగీకరించింది.
అదలావుంటే తాజా పిటిషన్లపై అధికారిక నోటీసులు ఇంకా రాలేదనేది కేంద్రం వాదన. ఆ క్రమంలో అఫిడవిట్ దాఖలుకు 4 వారాల గడువు కావాలని కోరారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. అయితే కేంద్రం విన్నపాన్ని తోసిపుచ్చింది చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం. రివ్యూ పిటిషన్ల విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది.