గోల్డెన్ గర్ల్... రాఫెల్ యుద్ద విమానం నడపనున్న మొట్టమొదటి మహిళా పైలట్ ఎవరో తెలుసా...
ఇండియన్ ఎయిర్ఫోర్స్ అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రంగా మారిన రాఫెల్ యుద్ద విమానాన్ని ఇకపై మహిళా పైలట్లు కూడా నడపనున్నారు. ఈ అదృష్టం మొదట ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ను వరించింది. ప్రస్తుతం శిక్షణలో ఉన్న శివంగి సింగ్... త్వరలోనే ఆరోస్ 17 స్క్వ్రాడ్రన్లో చేరి రాఫెల్ యుద్ద విమానాలను నడపనున్నారు.
Recommended Video
Fact Check : రాఫెల్ విమానం అక్కడ కూలిపోయిందా..?
విమెన్ ఫైటర్ పైలట్స్ సెకండ్ బ్యాచ్ 2017కి చెందిన శివంగి సింగ్ స్వస్థలం వారణాసి కావడం గమనార్హం. 2017లో విమెన్ ఫైటర్ పైలట్స్ సెకండ్ బ్యాచ్లో చేరినప్పటి నుంచి ఆమె మిగ్-21 యుద్ద విమానాలను నడుపుతున్నారు. చిన్నతనం నుంచే శివంగికి పైలట్ కావాలనే డ్రీమ్ ఉండేది. వారణాసిలో స్కూల్ విద్య పూర్తయ్యాక ప్రముఖ బనారస్ హిందూ యూనివర్సిటీ(BHU)లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్-7 యూపీ ఎయిర్ స్క్వ్రాడ్రన్లో చేరారు. ఆ తర్వాత 2016లో ఎయిర్ఫోర్స్ అకాడమీలో చేరారు. ఇక ఇప్పుడు యుద్ద విమానం మిగ్-21 నుంచి అత్యాధునిక రాఫెల్ యుద్ద విమానానికి మారబోతున్నారు.
రాఫెల్ యుద్ద విమానాలను నడిపేందుకు మహిళా పైలట్ల పేర్లను కేంద్రం పరిశీలిస్తున్నట్లు కథనాలు వచ్చిన రెండు రోజులకే శివంగి సింగ్ పేరు ఖరారు కావడం గమనార్హం. కాగా,రక్షణ రంగంలో యుద్ద విమానాల పైలట్లుగా మహిళలకు అవకాశం కల్పిస్తూ మోదీ సర్కార్ 2015లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఎయిర్ఫోర్స్లో ఇప్పటికే పనిచేస్తున్న మహిళా పైలట్లలో కొందరిని ఎంపిక చేసి యుద్ద విమానాలు నడిపేందుకు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం భారత వైమానిక దళంలో మహిళలు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరిలో 10 మంది యుద్ధవిమాన పైలట్లు, 18 మంది నేవిగేటర్లు ఉన్నారు. మొత్తంగా మహిళా అధికారుల సంఖ్య 1875గా ఉంది