రాఫెల్..రణనినాదం: అంబాలాలో ల్యాండ్: కళ్లు చెదిరేలా: ఏడు వేల కి.మీ.సుదీర్ఘ ప్రయాణం
అంబాలా: రక్షణశాఖ అమ్ములపొదిలో చేరబోతోన్న బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకున్నాయి. కొద్దిసేపటి కిందటే అవి హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో గల వైమానిక దళ ఎయిర్బేస్ స్టేషన్లో ల్యాండ్ అయ్యాయి. సోమవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు ఈ మధ్యాహ్నం అంబాలాకు చేరుకున్నాయి. మార్గమధ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొద్దిసేపు విశ్రాంతి కోసం వాటిని ల్యాండ్ చేశారు.
Recommended Video
గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే.. ఘనస్వాగతం
అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన రాఫెల్ జెట్ ఫైటర్లు అంబాలాలోని ఎయిర్బేస్ స్టేషన్కు చేరుకున్నాయి. అంతకుముందు- రాఫెల్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశంచిన వెంటనే ఐఎన్ఎస్ కోల్కత డెల్టా 63 వాటికి ఘన స్వాగతాన్ని పలికింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ కోల్కత డెల్టా నుంచి స్వాగత సందేశాన్ని రాఫెల్ యుద్ధ విమానాల కమాండర్కు పంపించారు. ఘన స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. దీనికి ప్రతిగా రాఫెల్ కమాండర్.. కృతజ్ఙతలు తెలిపారు.
ఆశయాలను నెరవేరుస్తామంటూ రాఫెల్ కమాండర్
భారత యుద్ధ నౌకలతో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఐఎన్ఎస్ కోల్కత అధికారులు తమ సందేశాన్ని కొనసాగించారు. భారత వైమానిక దళ కీర్తిని ఆకాశాన్ని అందుకునేలా చేయాలని అకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అందరి ఆశయాలను నెరవేరుస్తామంటూ రాఫెల్ కమాండర్ బదులిచ్చారు. ల్యాండ్ అయిన తరువాత- అంబాలా ఎయిర్బేస్లో వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా వాటికి స్వాగతం పలికారు.
సుఖోయ్.. వెంటరాగా
భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే రెండు సుఖోయ్ యుద్ద విమానాలు వాటికి గార్డ్ చేశాయి. గమ్యస్థానానికి బయలుదేరిన పక్షుల గుంపులా వీ షేప్లో అయిదు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ వైపు దూసుకొస్తుండగా.. వాటి చివరలో రెండు సుఖోయ్్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు రక్షణగా నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను రక్షణమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సుఖోయ్ యుద్ధ విమానాల గార్డ్ను ఎయిర్ వింగ్ కమాండర్లు మరో యుద్ధ విమానం నుంచి చిత్రీకరించారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రాఫెల్ యుద్ధ విమానాలకు అపూర్వ రీతిలో స్వాగతం పలకడానికి వైమానిక దళాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటికి వాటర్ క్యానన్లతో స్వాగతం పలకబోతున్నారు. దీనికోసం అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేశారు. ల్యాండ్ అయిన వెంటనే వాటిపై నీళ్లను చల్లుతూ స్వాగతం పలుకుతారు. కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయిన సమయంలో వాటర్ క్యానన్లతో స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సంప్రదాయాన్ని కొనసాగించనుంది.