రాఫెల్ డీల్పై కాగ్ నివేదిక మరో సంచలనం.. టెక్నాలజీ పేరుతో విమానాలు అంటగట్టారా ?
అనేక వివాదాలను, విపక్షాల విమర్శలను దాటుకుంటూ కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ విమానాలపై మరో వివాదం నెలకొంది. భారత్కు విమానాలను విక్రయించిన ఫ్రెంచ్ సంస్ద డసాల్ట్ ఏవియేషన్, ఐరోపా క్షిపణి తయారీదారు ఎంబీడీఏ గతంలో ఒప్పుకున్న విధంగా భారత్లో తేలిక పాటి యుద్ధ విమానాల ఇంజన్ తయారీకి సంబంధించిన పరిజ్ఞానం డీఆర్డీవోకు బదలాయించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ దీనిపై వారు నోరు మెదపకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటుకు కాగ్ తాజాగా సమర్పించిన నివేదికలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఆయా సంస్ధల నుంచి టెక్నాలజీ తీసుకోవాల్సిన బాధ్యత డీఆర్డీవోతో పాటు రక్షణశాఖపైనా ఉందని పేర్కొంది.
గోల్డెన్ గర్ల్... రాఫెల్ యుద్ద విమానం నడపనున్న మొట్టమొదటి మహిళా పైలట్ ఎవరో తెలుసా...
రాఫెల్ ఒప్పందంలో మరో కోణం...
ఇండియన్ ఎయిర్ఫోర్స్ను బలోపేతం చేసేందుకు కేంద్రం 126 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఎంఎంఆర్సీఏ బిడ్ నిర్వహించింది. ఇందులో ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ బిడ్ కైవసం చేసుకుంది. డీల్ ప్రకారం భారత్కు తొలి విడతగా 36 ఫైటర్ జెట్లను 60 వేల ఖర్చుతో విక్రయించాల్సి ఉంది. ఇందులో 30 ఫైటర్ జెట్లు కాగా.. మరో 6 ట్రైనర్ విమానాలు ఉన్నాయి. ఈ 36 జెట్లలో
18 జెట్లను డసాల్ట్ పూర్తిగా నిర్మించి భారత్కు అందించాల్సి ఉంది. మిగిలిన 108 ఎయిర్క్రాఫ్ట్లను భారత్కు చెందిన హిందుస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు తమ పరిజ్ఞానాన్ని బదిలీ చేసి డసాల్ట్ నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అంశం బయటికొచ్చింది. 36 జెట్లలో ఐదింటిని భారత్కు పంపిన డసాల్ట్.. మిగిలిన వాటిని త్వరలో పంపనుంది. మరో 108 ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి సంబంధించి టెక్నాలజీ బదలాయింపుపై మాత్రం నోరుమెదపడం లేదు.
బయటపెట్టిన కాగ్ నివేదిక...
60 వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం కేంద్రం కుదుర్చుకున్న డీల్పై విపక్షాల ఆరోపణలకు ఊతమిచ్చేలా వాటి విక్రేతలు సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించి నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశాన్ని పార్లమెంటుకు నిన్న సమర్పించిన నివేదికలో కాగ్ బయటపెట్టింది. అదే సమయంలో కేంద్రం పార్లమెంటు సమావేశాలను కరోనా పేరుతో నిరవధికంగా వాయిదా వేయడంతో ఈ వ్యవహారం లేవనెత్తేందుకు విపక్షాలకు అవకాశం లేకుండా పోయింది. కేంద్రంతో డసాల్ట్, ఎంబీడీఏ గతంలో కుదుర్చుకున్న ఆఫ్సెట్ ఒప్పందం ప్రకారం రాఫెల్ టెక్నాలజీని బదలాయించాల్సి ఉంది. దీంతో హిందుస్ధాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ 108 జెట్ ఫైటర్స్ తయారు చేయాల్సి ఉంది. కానీ ఈ టెక్నాలజీ బదిలీ చేస్తారో లేదో కూడా ఇంకా చెప్పడం లేదని కాగ్ ఆక్షేపించింది.
టెక్నాలజీ బదలాయింపుపై అనుమానాలు ?
భారత్లోని డీఆర్డీవోతో కుదుర్చుకున్న ఆఫ్సెట్ ఒప్పందం ప్రకారం డసాల్ట్, ఎంబీడీఏ తేలికపాటి యుద్ధ విమానాల ఇంజన్ తయారీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని బదలాయించాల్సి ఉంది. కానీ గతేడాది అక్టోబర్లో రక్షణ శాఖ సమర్పించిన ఓ నివేదికలో డసాల్ట్కు టెక్నాలజీ సామర్ధ్యం లేదని ప్రస్తావించింది. దీంతో ఇప్పుడు ఈ టెక్నాలజీ బదలాయింపు ఉంటుందా లేదా అనే విషయాన్ని కేంద్రం స్పష్టం చేయడం లేదు. గతంలో కుదిరిన ఆఫ్సెట్ నిబంధనల ప్రకారం కేంద్రం, డీఆర్డీవో ఈ పరిజ్ఞానాన్ని భారత్ పొందేలా ప్రయత్నించాల్సి ఉందని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. రక్షణ పరికరాల కొనుగోళ్ల కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం ఈ టెక్నాలజీ భారత్కు వచ్చి తీరాలని కాగ్ తెలిపింది.
Recommended Video
టెక్నాలజీ పేరుతో విమానాలు అంటగట్టారా ?
2015 సెప్టెంబర్లో డీఆర్డీవోకు అత్యున్నత స్ధాయి సాంకేతిక పరిజ్ఞానం ఇస్తామన్న పేరుతోనే డసాల్ట్, ఎండీబీఏ రాఫెల్ విమానాల్లో 30 శాతం అమ్మేందుకు ప్రతిపాదించాయి. దీంతో ఇప్పుడు ఆ టెక్నాలజీ ఇచ్చేందుకు విక్రేతలు ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఆ టెక్నాలజీ బదలాయింపుపై ఆయా సంస్ధలు నోరు మెదపకపోవడంతో ఆనుమానాలు మొదలయ్యాయి. 2016లో మొత్తం ఆరు రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని తాము ఆయా సంస్ధల నుంచి తీసుకోవాల్సి ఉందని డీఆర్డీవో తెలిపింది. ఇందులో ఐదు టెక్నాలజీలను బదలాయించే సామర్ధ్యం తమకు లేదని వారు డీఆర్డీవోకు స్పష్టం చేశారు. ఆరో టెక్నాలజీ తేలికపాటి యుద్ధ విమానాల ఇంజన్లు తయారీ చేసేందుకు ఉద్దేశించినదే. ఈ టెక్నాలజీ బదలాయింపుపై సైతం ఇప్పటికీ వారు స్పందించడం లేదు. దీంతో టెక్నాలజీ పేరుతో రాఫెల్ యుద్ధ విమానాలను భారత్కు అంటగట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.