సుప్రీంలో రాఫెల్ విచారణ: రాఫెల్ వివరాలపై ఇండియన్ ఎయర్ ఫోర్స్ అధికారులను ప్రశ్నించిన న్యాయస్థానం
రాఫెల్ యుద్ధ విమానంకు సంబంధించి దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం నిబంధనల మేరకే నడుచుకుందా లేదా అనే అంశంపై కోర్టులో హాజరైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను ప్రశ్నించింది.
ఎయిర్ ఫోర్స్ అధికారులను ప్రశ్నించిన న్యాయస్థానం
ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్కే కౌల్, కేఎం జోసెఫ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేసును విచారణ చేస్తోంది. యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో ముడిపడి ఉన్నందున వారి వర్షన్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు భావించింది.అంతేకాని రక్షణ శాఖ వాదనలతో కోర్టుకు పనిలేదని బెంచ్ అభిప్రాయపడింది. దీంతో వైస్ ఛీఫ్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరితో పాటు మరో ఇద్దరు సీనియర్ ఉన్నతాధికారులు బెంచ్ ముందకు హాజరయ్యారు. తాజాగా ఇండియన్ ఆర్మీలోకి వచ్చి చేరిన యుద్ధ విమానాలతో పాటు భారత్లో తయారైన యుద్ధ విమానాలపై ఆరా తీసింది న్యాయస్థానం. ఇక రాఫెల్కు సంబంధించిన ధరల వివరాలు పిటిషనర్లతో పంచుకోరాదని, ఇక ధరల విషయమై ఏదైనా చర్చ వస్తే అప్పుడు కూడా కోర్టు చెబితేనే ధరల విషయాలను బహిర్గతం చేయాలని ఆదేశించింది.
జ్యుడీషియరీ ఎంక్వైరీని వ్యతిరేకించిన కేంద్రం
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై జుడీషియరీ ఎంక్వైరీని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. సర్వోన్నత న్యాయస్థానానికి ఈ ధరల విషయమై అవగాహన ఉందా అని ప్రశ్నించింది. అంతేకాదు ఈ తరహా విమానాలు ఎలాంటి ఆయుధాలు సాంకేతిక వినియోగిస్తాయో జడ్జీలకు తెలియదని... ఆ సత్తా ఉందని తాను భావించడం లేదని అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. ఇక ధరల విషయానికొస్తే ధరల వివరాలు కేంద్రం రహస్యంగా ఉంచిందన్నారు. ఎందుకంటే భారత్ ఆయుధాల వివరాలు బహిర్గతం చేయదని ఒకవేళ చేస్తే అది శతృదేశాల చేతికి అస్త్రం ఇచ్చినట్లే అని కోర్టుకు కేంద్రం తరపున అటార్నీ జనరల్ వివరించారు. పాత ఒప్పందాల విషయంలో కూడా ఆయుధాలకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయలేదని కోర్టుకు తెలిపింది.
ఒప్పందంపై గ్యారెంటీ ఇవ్వని ఫ్రాన్స్ ప్రభుత్వం
మరోవైపు యూపీఏ హయాంలో చేసుకున్న ఒప్పంద ధరలే కొత్త ఒప్పందంలో ఉన్నాయా అని న్యాయస్థానం ప్రశ్నించగా ఒకే ధర అని అటార్నీ జనరల్ సమధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీల తరపున వాదించారు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్. ఇంటర్ గవర్నమెంట్ అగ్రీమెంట్ను ప్రవేశపెట్టి టెండర్ ప్రక్రియను ఎన్డీఏ సర్కార్ తొలగించిందని ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. అంతేకాదు ఫ్రాన్స్ ప్రభుత్వం ఒప్పందంపై ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముందుగా అన్ని విషయాలు వెల్లడిస్తామని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపిందని తర్వాత ఇంటర్ గవర్నమెంట్ అగ్రీమెంట్ కాబట్టి వివరాలను బహిర్గతం చేయలేమని చెబుతోందని కోర్టుకు తెలిపారు ప్రశాంత్ భూషణ్.
భారత ఎయిర్ ఫోర్స్కు 126 ఫైటర్ జెట్లు అవసరం కాగా ఇదే విషయాన్ని డిఫెన్స్ అక్విసిషన్ కౌన్సిల్కు తెలిపిందని చెప్పిన ప్రశాంత్ భూషణ్... ముందుగా ఆరు విదేశీ కంపెనీలు దరఖాస్తు చేసుకోగా అందులోనుంచి అప్పటి ప్రభుత్వం రెండు కంపెనీలను ఎంపిక చేసిందని వివరించారు. ఇక తర్వాత ఒప్పందం ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్కు వెళ్లిందని ఇందులో భాగంగానే భారత్కు చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ కూడా ఉందని చెప్పారు. ఇక హఠాత్తుగా సాంకేతికత బదిలీ ఉండదంటూ 36 రాఫెల్ విమానాలను కొనుగోలు చేస్తున్నామంటూ చెప్పడమేంటని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ప్రశాంత్ భూషణ్. అంతేకాదు ప్రధాని రహస్యంగా చేసుకున్న ఈ ఒప్పందం గురించి రక్షణశాఖ మంత్రికి కూడా వివరాలు తెలియవని చెప్పారు.
కేంద్రం ఇస్తున్న వివరణ సంతృప్తిగా లేదు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అర్జెంటుగా విమానాలు కొనుగోలు చేయాలి కాబట్టి కొత్త ఒప్పందం చేసుకున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ప్రశాంత్ భూషణ్.ఇప్పటికే రాఫెల్ ఒప్పందం జరిగి మూడున్నరేళ్లు గడిచాయి. ఇప్పటి వరకు ఒక్క యుద్ధ విమానం కూడా భారత ఎయిర్ ఫోర్స్లో చేరలేదన్నారు. ఇక సెప్టెంబర్ 2019 కల్లా తొలి రాఫెల్ విమానం డెలివరీ ఉంటుందన్నారు.. ఇది 2022 వరకు కొనసాగుతుందని కేంద్రం చెబుతోందని... అదే పాత ఒప్పందం ప్రకారమే వెళ్లి ఉంటే 2019 ఏప్రిల్ నాటికి 18 యుద్ధ విమానాలు వచ్చేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ప్రశాంత్ భూషణ్. వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసి తీర్పును రిజర్వ్లో పెట్టింది.