ఫ్రెంచ్ న్యూస్ పోర్టల్ కథనం: కాంట్రాక్ట్ రావాలంటే రిలయన్స్తో ఒప్పందం తప్పనిసరి అన్న దసాల్ట్ అధికారి
ఫ్రాన్స్ ఆన్లైన్ వార్తా సంస్థ మీడియాపార్ట్ రాఫెల్ ఒప్పందం గురించి కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. ఫ్రెంచి సంస్థ దసాల్ట్ ఏవియేషన్కు చెందిన ఉన్నతాధికారి 36 రాఫెల్ యుద్ధ విమానాలు తమ సంస్థ నుంచి కొనుగోలు చేయాలంటే భారత్కు చెందిన అనిల్ అంబానీ రిలయన్స్ సంస్థను ఆఫ్సెట్ భాగస్వామిగా చేర్చుకోవడం తప్ప మరో దారి లేదంటూ షరతులు విధించినట్లు మీడియా పార్ట్ కథనాన్ని ప్రచురించింది. ఇది కూడా ఆ ఉన్నతాధికారి ఈ విషయాలను మే 2017లో తన సిబ్బందికి వివరించారని కథనంలో పేర్కొంది.
రిలయన్స్ తప్ప వేరే ఆప్షన్ ఇవ్వలేదు: దసాల్ట్ డిప్యూటీ సీఈఓ
దసాల్ట్ ఏవియేషన్ డిప్యూటీ సీఈఓ లోయిక్ సెగలెన్ మే 11,2017లో దసాల్ట్ రిలయన్స్ ఎయిరోస్పేస్ లిమిటెడ్కు సంయుక్తంగా ఓ ప్రెజెంటేషన్ ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కథనం ప్రచురించింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నట్లు ఆ న్యూస్ పోర్టల్ వెల్లడించింది. రాఫెల్ యుద్ధ విమానాల ఎగుమతికి రిలయన్స్ ను తమ ఆఫ్సెట్ పార్ట్నర్గా చేసుకుంటేనే తమకు భారత్ నుంచి ఆర్డర్ దక్కుతుందని డిప్యూటీ సీఈఓ చెప్పడం అందులో ఉన్నట్లు వెబ్సైట్ పేర్కొంది. మేకిన్ ఇండియా పాలసీ ప్రకారం రిలయన్స్తో దసాల్ట్ కంపెనీ జట్టుకట్టిందని అది దసాల్ట్ సీఈఓ తీసుకున్న నిర్ణయం అని కంపెనీ యాజమాన్యం చెప్పుకుంటూ వచ్చింది.
రాఫెల్ చర్చల సమయంలోనే అనిల్ అంబానీ ఫ్రెంచ్ సినిమాను నిర్మించారు
రాఫెల్ డీల్కు సంబంధించి ఆఫ్ సెట్ పార్ట్నర్గా అనిల్ అంబానీ కంపెనీ పేరును సూచించింది భారత ప్రభుత్వమే అని చెప్పి ఫ్రాన్స్ హోలాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే దసాల్ట్ డిప్యూటీ సీఈఓ సెగలెన్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఢిఫెన్స్ సంస్థను ఆఫ్సెట్ పార్ట్నర్గా చేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పడం చూస్తే ఏదో అవకతవకలు జరిగాయనే వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. అంతేకాదు మీడియాపార్ట్ మరో విషయాన్ని కూడా బయటపెట్టింది. రాఫెల్ ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్ ప్రముఖ నటి నిర్మాత జాలీ గయేట్ నిర్మిస్తున్న చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించారని ఫ్రాంకోయిస్ హోలాండే తెలిపినట్లు కథనం వెల్లడించింది.
గైడ్లైన్ ప్రకారమే ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక
ఇదిలా ఉంటే ఆఫ్సెట్ పార్ట్నర్ ఎంపికలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని ప్రభుత్వం వెల్లడించింది. అనవసరమైన సత్యదూరమైన ఆరోపణలు విపక్షాలు చేస్తున్నాయని ధ్వజమెత్తింది. డిఫెన్స్ ఆఫ్సెట్ గైడ్లైన్స్ ప్రకారం ఒక సంస్థ తమ భాగస్వామిగా ఎవరినైనా ఎంపిక చేసుకునే వీలుందని గుర్తుచేసింది. ఈ క్రమంలోనే ఒక విదేశీ ఉత్పత్తి సంస్థ భారత్లో ఎవరినైనా లేదా ఏ సంస్థనైనా తమ భాగస్వామిగా ఎంపిక చేసుకునేలా గైడ్లైన్స్ ఉన్నాయని వెల్లడించింది. ఈ క్రమంలోనే రూ.59వేల కోట్ల రూపాయల రాఫెల్ ఒప్పందంలో దసాల్ట్ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ సంస్థను ఆఫ్సెట్ పార్ట్నర్గా చేర్చుకుంది. ఇందులో రిలయన్స్ సంస్థకు 51శాతం వాటా ఉండగా.. దసాల్ట్ సంస్థకు 49శాతం వాటా ఉంది. నాగ్పూర్లో ఏర్పాటు కానున్న ప్లాంట్కు 100 మిలియన్ యూరోలు పెట్టుబడి పెట్టనున్నట్లు దసాల్ట్ సంస్థ సీఈఓ ఎరిక్ టాపియర్ అక్టోబర్ 2017లో ప్రకటించారు. 2018 నుంచి ఉత్పత్తి ప్రారంభమై 2019 నుంచి 2023 మధ్య రాఫెల్ విమానాలు సేవలందిస్తాయని తెలిపారు.