బెంగళూరు కాలేజ్ లో ర్యాగింగ్: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య, మాకు తెలీదు!
బెంగళూరు: కాలేజ్ లో సాటి విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరీనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాజరాజేశ్వరీ నగరలోని చెన్నసంద్రలోని శబరి అపార్ట్ మెంట్ లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న మేఘనా (18) అనే యువతి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇంజనీరింగ్ కాలేజ్
బెంగళూరులోని కుమారస్వామి లేఔట్ లోని దయానంద ఇంజనీరింగ్ కాలేజ్ లో మేఘనా బీఇ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది. మంగళవారం ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో మేఘనా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఎన్నికల్లో పోటీ ?
కాలేజ్ లో ఇటీవల క్లాస్ రెప్రసెంటివ్ ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల్లో పోటీ చేసిన మేఘనా ఓడిపోయారని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసినందుకు సాటి విద్యార్థులు ర్యాగింగ్ చేశారని, అసభ్యంగా మాట్లాడారని మేఘనా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇంటికే పరిమితం
సాటి విద్యార్థులు వేధిస్తున్నారని కొంత కాలంగా మేఘనా కాలేజ్ కు వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయింది. తరువాత మేమే నచ్చ చెప్పి మేఘనాను కాలేజ్ కు పంపించామని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయినా మేఘనాను వేధించారని వారు ఆరోపిస్తున్నారు.
వీళ్లే కారణం
మేఘనా కాలేజ్ కు మళ్లీ వెళ్లిన సమయంలో నిఖిల్, సందీప్ తదితరులు ఆమెను వేధించారని, అసభ్యంగా దూషించి మొబైల్ కు మేసేజ్ లు పంపించారని, అందుకే మా కుమార్తె ఆత్మహత్య చేసుకుందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు.
కాలేజ్ యాజమాన్యం
మా కాలేజ్ లో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని, క్లాస్ రెప్రసెంటివ్ ఎన్నికలు అసలు నిర్వహించలేదని, కాలేజ్ బయట ఎవైనా గొడవలు జరిగి ఉంటే అవి మాకు సంబంధం లేదని కాలేజ్ యాజమాన్యం అంటోంది. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మేఘనా రెండు రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యిందని కాలేజ్ యాజమాన్యం చెప్పింది.
పోలీసులు మేఘనా స్నేహితులను విచారించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.