రాఘవ లారెన్స్ ను అడ్డుకున్న పోలీసులు: హీరో విశాల్, స్టాలిన్ మద్దతు
చెన్నై: తమిళనాడులోని పుదుకోటై జిల్లా నెడువాసల్ లో హైడ్రోకార్బన్ పథకానికి వ్యతిరేకంగా ప్రముఖ సినీ నృత్యదర్శకుడు, సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత రాఘవ లారెన్స్ చేపట్టదలచిన నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు.
చెన్నైలోని పల్లువర్ కోట్టం వద్ద నెడువాసల్ హైడ్రోకార్బన్ ఉద్మమానికి మద్దతుగా రాఘవ లారెన్స్ తన అభిమానులు, విద్యార్థులతో కలిసి నిరాహార దీక్ష చేయడానికి సిద్దం అయ్యారు. నిరాహార దీక్షచెయ్యడానికి వారం రోజుల ముందే లారెన్స్ తమిళనాడు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు.
షాక్ ఇచ్చిన పోలీసులు
లారెన్స్ నిరాహార దీక్ష చెయ్యడానికి భారీగా పందిరి నిర్మించారు. వందలాధిమంది అభిమానులు, విద్యార్థులు పల్లువర్ కోట్టం దగ్గరకు చేరుకున్నారు. నిరాహార దీక్ష మొదలుపెడుతున్న సమయంలో అక్కడ పోలీసులు ప్రత్యక్షం అయ్యారు. మీరు ఇక్కడ నిరాహార దీక్ష చెయ్యడానికి అనుమతిలేదని, ముందుగా ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నామని లారెన్స్ కు చావుకబురు చల్లగా చెప్పారు.
వివరణ ఇచ్చిన రాఘవ లారెన్స్
నిరాహార దీక్షకు ఇచ్చిన అనుమతులను పోలీసులు రద్దు చెయ్యడంతో లారెన్స్ తో సహ ఆయన అభిమానులు, విద్యార్థులు అక్కడి నుంచి వెనుతిరిగారు. తరువాత లారెన్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమిళనాడు పర్యటనలో ఉన్న కారణంగా తన నిరాహార దీక్ష అనుమతులు రద్దు చేశారని, మంచి రోజు చూసుకుని దీక్ష చేస్తామని లారెన్స్ పేర్కొన్నారు.
సంపూర్ణ మద్దతు ఇచ్చిన హీరో విశాల్
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ పుదుకోట్టే జిల్లాలోని నెడువాసల్ గ్రామానికి చేరుకుని హైడ్రోకార్బన్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గ్రామస్తులతో కలిసి విశాల్ నిరాహారదీక్షలో పాల్గొన్నారు.
ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్
తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ నెడువాసల్ గ్రామానికి చేరుకుని హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న గ్రామస్తులకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా స్టాలిన్ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, వారి మనోభావాలు దెబ్బతియ్యకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ పథకాన్ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభ సభ్యుడు డి. రాజా మద్దతు
రాజ్యసభ సభ్యుడు డి. రాజా పుదుకోటై జిల్లాలోని నెడువాసల్ గ్రామానికి చేరుకుని హైడ్రోకార్బన్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి గ్రామ ప్రజల జీవితాలను ఫలంగా పెట్టి ఈ ప్రాజెక్టు పనులు చేపట్టిందని గ్రామస్తులు మండిపడ్డారు. దాదాపు 8 వేల మంది గ్రామస్తులు, విద్యార్థులు, యువతీ యువకులు ఉద్యమంలో పాల్గొనడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.